ఇండియాకి మరో తుఫాన్ ముప్పు: అరేబియా సముద్రంలో షహీన్ తుఫాన్, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఇండియాకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. షహీన్ తుఫాన్ ఇవాళ లేదా శుక్రవారం నాటికి అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో గుజరాత్, సౌరాష్ట్ర తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఇండియాకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. శుక్రవారం నాడు అరేబియా సముద్రంలో షహీన్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇండియాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
షహీన్ తుఫాన్ గురువారం నాడు రాత్రి లేదా శుక్రవారం నాడు అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, గుజరాత్, కొంకన్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సౌరాష్ట్రపై అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఈశాన్య అరేబియా సముద్రంలో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలే ముందు అల్పపీడనంగా మారుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో షహీన్ తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆ తర్వాత తుఫాన్ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగే అవకాశం ఉంది. పాకిస్తాన్ మెక్రాన్ తీరాలకు దగ్గరగా, భారత తీరం నుండి దూరంగా వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రాంతం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ను అనుకొని ఉంది. ఈ తుఫాన్ కారణంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాాత్, ఉత్తరకొంకణ్, గంగాటిక్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అక్టోబర్ 3 వరకు బీహార్ లో కూడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.