Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫాను ప్రభావంతో రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని జలోర్, బార్మర్, సిరోహి, బన్స్వారా, ఉదయ్ పూర్, రాజ్ సమంద్, పాలి, అజ్మీర్, కోటా సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జలోర్ జిల్లాలోని సంచోర్ వద్ద సురవ ఆనకట్ట తెగిపోవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.
Heavy rains in Rajasthan : అరేబియా సముద్రం నుంచి ఉద్భవించిన బిపర్జోయ్ తుఫాను గుజరాత్ పై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రాజస్థాన్ లో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో గత 36 గంటలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. బిపర్జోయ్ తుఫాను ప్రభావంతో రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని జలోర్, బార్మర్, సిరోహి, బన్స్వారా, ఉదయ్ పూర్, రాజ్ సమంద్, పాలి, అజ్మీర్, కోటా సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జలోర్ జిల్లాలోని సంచోర్ వద్ద సురవ ఆనకట్ట తెగిపోవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీని ప్రభావంతో నర్మదా లిఫ్ట్ కెనాల్ నీటిమట్టం పెరుగుతోంది. ఇది సంచోర్ నగరానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే అక్కడి అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి, నగరంలోని ముంపు ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించడానికి తక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆనకట్టకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంచోర్ లో దాదాపు 50,000 జనాభా నివాసముంటున్నారు. జలోర్ తో పాటు సిరోహి, బార్మర్ లలో కూడా వరద ముప్పు పెరుగుతోంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో 4-5 అడుగుల వరకు నీటిమట్టం పెరగడంతో ఎన్డీఆర్ఎఫ్-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 2021లో సంభవించిన టౌ-టె తుఫాను కంటే బిపర్జోయ్ తుఫాను అత్యంత ప్రమాదకరమైనదని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. రాజస్థాన్ పశ్చిమ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర రాజధాని జైపూర్ లో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దౌసా, అల్వార్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
