గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాన్ ప్రభావిత కచ్ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించారు.

గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలోనే తుపాన్ ప్రభావిత కచ్ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి అమిత్ షా.. కచ్ జిల్లాలో బిపర్‌జోయ్ తుపాన్ కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాండ్వి సివిల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చేరిన ప్రజలను పరామర్శించారు. అలాగే జిల్లాలో తుపాన్ సంబంధిత సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. అలాగే మాండ్విలోని కత్డా గ్రామ ప్రజలతో అమిత్ షా సమావేశమయ్యారు. అనంతరం జఖౌ గ్రామంలో సహాయక శిబిరంలో ప్రజలతో సంభాషించారు. వారికి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఇక, భుజ్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని కూడా అమిత్ షా సందర్శించనున్నారు. బిపర్‌జోయ్ తుపాన్ బాధిత ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలను సమీక్షిస్తారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు అమిత్ షా భుజ్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

Scroll to load tweet…

అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్‌జోయ్ తుపాన్ భారతదేశ పశ్చిమ తీరంలో కల్లోలం సృష్టించింది. బిపర్‌జోయ్ తుపాను గురువారం రాత్రి గుజరాత్‌లోని కచ్‌లోని జాఖౌ నౌకాశ్రయానికి ఉత్తరంగా 10 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని తాకింది. బిపర్‌జోయ్ ప్రభావంతో గుజరాత్‌లోని పలు జిల్లాలతో పాటు, దక్షిణ రాజస్తాన్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.