కరోనా బాధితురాలి బంధువుతో చర్చలు.. క్వారంటైన్ కి ఎంపీ
పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో తన మనవరాలికి చికిత్స అందించేలా సిఫారసు లేఖ ఇవ్వాలని కోరుతూ ఆ మహిళ ఎంపీ ఇంటికొచ్చి అర్థించింది. దీనికి స్పందించిన ఎంపీ సిఫారసు లేఖ ఇచ్చారు.
తమిళనాడులోని కడలూరు డీఎంకే ఎంపీ టీఆర్వీఎస్ రమేశ్ క్వారంటైన్లోకి వెళ్లారు. బన్రూటిలోని ఆయన ఇంటికి మునిసిపల్ అధికారులు క్వారంటైన్ నోటీసు అంటించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తట్టంచావిడికి చెందిన ఓ మహిళ మనవరాలు కేన్సర్తో బాధపడుతోంది. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో తన మనవరాలికి చికిత్స అందించేలా సిఫారసు లేఖ ఇవ్వాలని కోరుతూ ఆ మహిళ ఎంపీ ఇంటికొచ్చి అర్థించింది. దీనికి స్పందించిన ఎంపీ సిఫారసు లేఖ ఇచ్చారు.
లేఖ తీసుకుని మహిళ ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మనవరాలికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆరోగ్యశాఖ అధికారులు బాలిక కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, బాలిక బామ్మ ఎంపీ రమేశ్ను కలిసిన విషయం తెలియగానే మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను క్వారంటైన్లో ఉండాలని సూచించి, ఆయన ఇంటికి క్వారంటైన్ నోటీసులు అంటించారు.