జోషిమఠ్ లో 678 ఇళ్లుకు పగుళ్లు.. ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం: పుష్కర్ సింగ్ ధామి
Joshimath: జోషిమఠ్ లో 678 ఇళ్లు పగిలిపోయాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యం అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఆయన జోషిమఠ్ ను సందర్శించారు. ఆదివారం ప్రధాని మోడీ కూడా ఇక్కడి పగుళ్ల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు.
Joshimath Land Subsidence: ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పగుళ్లు స్థానికంగా ఆందోళనను పెంచుతున్నాయి. రోజురోజుకూ అక్కడి పగుళ్ల సైజు సైతం పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఈ ప్రాంతం నుంచి తరలిపోతుండగా, మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం (జనవరి 9) జోషిమఠ్ లో భూమి కూలిపోవడానికి సంబంధించి ఒక జాతీయ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 678 ఇళ్లు, దుకాణాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లు, పగుళ్లు గుర్తించిన ప్రదేశాల నుంచి ప్రజలను ఖాళీ చేయించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రజలకు అద్దెలు, వస్తువులకు చెల్లింపులు చేస్తున్నారు. అద్దె కోసం రూ.4 వేలు, వస్తువులకు రూ.5 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని మోడీ
స్థానిక ప్రజల ఆరోపణలపై తాను అధికార యంత్రాంగాన్ని హెచ్చరించిన విషయాన్ని గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మన ముందు తలెత్తిన సమస్యపై మాత్రమే తాము పనిచేస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అలాగే, ఇదే విషయం గురించి చర్చించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తనతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. సాధ్యమైనంత సాయం అందిస్తామని తెలిపారు. ప్రధాని క్షణక్షణం సమాచారాన్ని తీసుకుంటున్నారు. సహాయక చర్యల గురించి కూడా ఆయన సమాచారం తీసుకున్నారని తెలిపారు.
జోషిమఠ్ లో అందరికీ మరింత సాయం అందిస్తున్నాము..
ప్రతిపక్షాలు తక్కువ డబ్బు సాయంగా ఇవ్వడంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మేము ప్రజలకు చేయగలిగినంత సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి రూ.4,50,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలకు అవసరమైన విధంగా సహాయం చేస్తారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్ తో ముందుకు రావాలని అన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది..
ఇది బీజేపీ సృష్టించిన విపత్తు అని ప్రతిపక్షాలు ఆరోపించాయి, దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రతిపక్షాల తీరును ఖండించారు. "ఈ సమయంలో ఇలాంటి వాదనలు వద్దు.. ఇలాంటి పనులు చేయకూడదు. జోషిమఠ్ పగుళ్లపై అన్ని రకాల సర్వేలు నిర్వహిస్తున్నారు. అనేక సంస్థలు అక్కడికక్కడే పనిచేస్తున్నాయి. ఇది జరగడానికి కారణాలు ఏమిటి? అనేదానిపై మరింత సమాచారం తెలిసిన తర్వాత మాత్రమే ఏదైనా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఎన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించగా ఎన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చినా ప్రభుత్వం అన్ని కుటుంబాలను ఆదుకుంటుందని సీఎం చెప్పారు. ప్రస్తుతం జోషిమఠ్ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
పగుళ్లపై పరిశోధనలు..
జోషిమఠ్ పగుళ్ల కారణాలు తెలుసుకోవడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు పరిశోధకులతో కూడిన టీమ్ ను ఏర్పాటు చేసింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం సైతం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితులపై మరిన్ని చర్యలకు నిర్ణయాలు తీసుకుంది.