సీపీఎం కార్యాలయాలకు నిప్పు.. బయట ఉన్న వాహనాలకూ
త్రిపురలో సీపీఎం పార్టీ కార్యాలయాలను గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. వాటి ముందు పార్క్ చేసిన వాహనాలకూ నిప్పు పెట్టారు. ఇది బీజేపీ పనే అని సీపీఎం ఆరోపించింది. కాదు, ఆ కార్యాలయాల నుంచే తమపైకి పెట్రో బాంబులు విసిరారని బీజేపీ ఆరోపించింది.
గువహతి: త్రిపురలో సీపీఎం, బీజేపీకి మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిని నిరసిస్తూ రాష్ట్రరాజధాని అగర్తలాలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీకి చెందిన రెండు కార్యాలయాలకు దుండగులు నిప్పు అంటించారు. ఇందులో రాజధాని అగర్తలోని హెడ్క్వార్టర్ కూడా ఉండటం గమనార్హం.
సీపీఎం రాష్ట్ర హెడ్క్వార్టర్ భాను స్మృతి భవన్, దశరథ్ భవన్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారు. ఆ కార్యాలయాల ఎదుట ఉన్న వాహనాలకూ నిప్పు పెట్టారు. ఈ పని బీజేపీవాళ్లదేనని సీపీఎం పార్టీ ఆరోపిస్తున్నది. కాగా, బీజేపీ ఖండించింది. తమపైనే సీపీఎం కార్యాలయాల నుంచి పెట్రో బాంబులు విసిరారని బీజేపీ ఆరోపించింది.