థర్డ్ వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఐసీఎంఆర్
ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది.
కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ అయితే.. మరింత అతలాకుతలం చేసేసింది. యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా.. త్వరలోనే థర్డ్ వేవ్ కూడా రానుందని... అది ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపించనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. దీనిపై ఐసీఎంఆర్ నివేదిక విడుదల చేసింది.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది.
ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు... కేవలం పిల్లలపైనే ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, "పిల్లలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం ఒక మైలురాయి సాధన అవుతుంది. పాఠశాలలను తిరిగి తెరవడానికి వారి కోసం బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమం చేస్తుంది." అని అన్నారు.
సెప్టెంబర్ లో రెండు నుంచి 18ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు భారత్ బయోటిక్ ప్రయోగాలు చేస్తోందని చెప్పారు.