కొవిడ్ థర్డ్ వేవ్ రావడం కాదు.. ఆల్రెడీ వచ్చేసిందని మేయర్ వార్నింగ్
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రావడం కాదు.. ఆల్రెడీ వచ్చేసిందని ముంబయి నగర మేయర్ వార్నింగ్ ఇచ్చారు. మహానగరంలో రోజువారీగా పెరుగుతున్న కేసులను ఉటంకిస్తూ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే నాగ్పూర్లో ఈ ప్రకటన చేసినట్టు గుర్తుచేశారు.
ముంబయి: కొవిడ్ థర్డ్ వేవ్ రావడం కాదు.. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిందని ముంబయి నగర మేయర్ వార్నింగ్ ఇచ్చారు. ముంబయిలో కరోనా కేసులు ఉన్నపళంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇప్పటికే నాగ్పూర్లో చేసినట్టు వివరించారు. ముంబయిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర మేయర్ ఈ హెచ్చరికలు చేశారు. ఆగస్టు నెలలో నమోదైన మొత్తం కేసుల్లో 28శాతం కేసులు కేవలం ఈ నెల తొలి ఆరు రోజుల్లోనే రిపోర్ట్ కావడం గమనార్హం.
ఈ మహానగరంలో సోమవారం 379 కొత్త కేసులు నమోదవ్వగా ఐదు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,46,725, మరణాల సంఖ్య 15,998, రికవరీలు 7,24,494లకు చేరాయి.
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా పెరుగుదల అధికారుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. గతేడాది ఫస్ట్ వేవ్ కూడా ఇలాంటి తరుణంలోనే ఫెస్టివ్ సీజన్ ప్రారంభంలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలను రద్దు చేసుకోవాలని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, పండుగలు భవిష్యత్లోనైనా జరుపుకోవచ్చని హెచ్చరించారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టి కరోనా వైరస్ థర్డ్ వేవ్ను నివారించాలని సూచించారు.