పెరుగుతున్న కేసులు: కరోనా గైడ్లైన్స్ ఆగష్టు 31కి పొడిగింపు
కరోనా మార్గదర్శకాలను ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. రానున్న రోజుల్లో పండుగలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
న్యూఢిల్లీ: కరోనా మార్గదర్శకాలను మళ్లీ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు నిబంధనలను పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచించింది.ఐదంచల మార్గదర్శకాలకు కట్టుబడాలని సూచించింది.దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా నిబంధనలను పాటించాలని పేర్కొంది.
వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేసింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర కల్పించింది. కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా, కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.పండుగల సీజన్ లో కరోనా కేసులు పెరగకుండా నిరంతరం దృష్టి పెట్టాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కూడ ఆయన ఆ లేఖలో సూచించారు.