కరుణా నిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో నిర్వహించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాతపూర్వకంగా ట్రాఫిక్ రామస్వామి తెలిపారు.

డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మేరీనాబీచ్ వద్ద నిర్వహించే విషయంపై ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గతంలో మెరినీ బీచ్ లో స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఆ పిటిషన్ ని రామస్వామి వెనక్కి తీసుకున్నారు. కరుణా నిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో నిర్వహించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాతపూర్వకంగా ట్రాఫిక్ రామస్వామి తెలిపారు. దీంతో.. కొంత వరకు ఆటంకాలు తొలగినట్లే అనిపిస్తోంది. మరికొద్ది సేపటిలో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

చెన్నైలోని మేరీనాబీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించాలని కరుణానిధి కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అయితే మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణకు తమిళనాడు సర్కార్ అంగీకరించలేదు. గాంధీ మండపం వద్ద అంత్యక్రియల నిర్వహణకు అంగీకరించింది. ఈ మేరకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

దీంతో మద్రాస్ హైకోర్టులో డీఎంకె పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మరో జడ్జి విచారణ జరిపారు. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి.

మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు డీఎంకె పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణను చేపట్టింది. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి. తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోర్టులో వాదనలను విన్పించారు.

మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణ వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం అబిప్రాయపడింది.అయితే వాదనలను విన్న కోర్టు విచారణను బుధవారం ఉదయం 8 గంటలవరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది.

మేరీనా బీచ్ లో అంత్యక్రియల నిర్వహణ విషయమై హైకోర్టు లాయర్ దొరైస్వామి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కూడ కరుణానిధి అంత్యక్రియల విషయంలో అడ్డంకిగా మారింది.