ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి అప్రూవర్గా మారారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి అప్రూవర్గా మారారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తాను అప్రూవర్గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి కోరగా.. ఈ అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. ఇక, ఈ కేసుకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన నేపథ్యంలో ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి ఉన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్గా మారడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతాయనే ఉత్కంఠ నెలకొంది. ఆప్ నేతలతో పాటు, ఎమ్మెల్సీ కవితకు మరింతగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గతేడాది నవంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ తరఫున శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ విషయమై కోర్టుకు సమర్పించిన చార్జీసీట్లలో పలు అంశాలను పేర్కొంది. అయితే కొద్ది వారాల క్రితం శరత్ చంద్రారెడ్డికి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.