వధువుకి కరోనా.. పీపీఈ కిట్ వేసుకొని మరీ పెళ్లి..!
వధువుకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో నూతన వధూవరులతోపాటు పురోహితుడు, అతిథులు కూడా పీపీఈ కిట్సు ధరించి వివాహ తంతులో పాల్గొన్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి పేరే వినపడుతోంది. ఈ మహమ్మారికి భయపడి చాలా మంది ఆ మధ్య పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఇది ఇప్పట్లో పోయేలా లేదులే అని.. అతి కొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాగా.. కొందరికైతే.. రెండు రోజుల్లో పెళ్లి అనగా కూడా కరోనా బారిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తారు పెళ్లి వాయిదా వేసుకుంటారు అంతకమించి ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా.. కానీ ఓ వధువు మాత్రం తనకు కరోనా వచ్చినా పెళ్లి మాత్రం ఆపలేదు.
వధువుకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో నూతన వధూవరులతోపాటు పురోహితుడు, అతిథులు కూడా పీపీఈ కిట్సు ధరించి వివాహ తంతులో పాల్గొన్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. షాబాద్ జిల్లాకు చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లికి తేదీ, ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి రోజే వధువుకు కరోనా సోకిందని పరీక్షల్లో వెల్లడైంది. కరోనా సోకినా ముందుగా నిశ్చయించిన ప్రకారం పెళ్లి కార్యక్రమాన్ని కొనసాగించాలని వధూవరుల కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు.
వధూవరులతోపాటు పురోహితుడు, పెళ్లికి హాజరైన అతిథుల కోసం పీపీఈ కిట్లను తెప్పించారు. వధూవరులతో పాటు అందరూ పీపీఈ కిట్లను ధరించి వివాహ తంతు కొనసాగించారు. పీపీఈ కిట్ ధరించిన పురోహితుడు వధూవరులకు సూచనలిస్తూ పెళ్లి జరిపించేశారు.వరుడు చేతికి తొడుగులతో పాటు పీపీఈ కిట్ వేసుకొని తలపాగా ధరించారు. వధువు పీపీఈ కిట్ తోపాటు ఫేస్ షీల్డు, చేతికి గ్లౌజులు ధరించి పెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీఈ కిట్ల మధ్య జరిగిన పెళ్లిని కరోనా పెళ్లిగా అతిథులు అభివర్ణించారు.