Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ -4: రైళ్లు, విమాన సర్వీసులపై నిషేధం.. సడలింపులివే..!!

దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులను జారీ చేసింది

coronavirus Lockdown-4 0 new guidelines
Author
New Delhi, First Published May 17, 2020, 9:41 PM IST

దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ క్రమంలో లాక్‌డౌన్ 4కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ప్రజా రవాణా విషయంలో గతంలో ఉన్నట్లే ఆంక్షలను విధించింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని ఆదేశాల్లో పేర్కొంది.

అదే సమయంలో కంటైన్మెంట్ జోన్లు మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకునేదుందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉండాలని స్పష్టం చేసింది. 

వీటిపై నిషేధం:

* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి  లేదు. దేశీయంగా మెడికల్ సేవలు, దేశీయ ఎయిర్ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. 

* మెట్రో రైలు సర్వీసులు
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్ధలు/ కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్‌లైన్ క్లాసులు మాత్రం కొనసాగుతాయి.
* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. వైద్య, పోలీస్, ప్రభుత్వోద్యోగులు, హెల్త్‌కేర్ వర్కర్లకు సేవలందించేవారికి, క్వారంటైన్‌లో ఉన్న వారికి వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.
* హోం డెలీవరి చేసే రెస్టారెంట్లుకు అనుమతులు
* బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో ఉన్న క్యాంటీన్లు నడిపేందుకు అనుమతులు
* సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు
* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదు
* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి  లేదు. ఈ కాలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు లేదు.

వీటికి అనుమతి (కంటైన్మెంట్ జోన్‌లు కాకుండా నిబంధనల మేరకు)

* రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి
* అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాధికారం రాష్ట్రాలదే.

కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు: 

* ఆయా జోన్లు ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలదే. 
* కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజల సంచారంపై నిషేధం
* కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు చేయాలి

ఇక రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అత్యవసర సేవలకు అనుమతి ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమల్లో ఉండాలి. ఇందుకు సంబంధించి స్ధానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి.

Follow Us:
Download App:
  • android
  • ios