Coronavirus: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కలకలం.. 14.97 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు !
Covid-19 spike: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది. కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా పరీక్షలను పెంచాలని సూచించింది.
Coronavirus: భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రానున్న పండగల సీజన్ దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది. కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా పరీక్షలను పెంచాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఢిల్లీలో ఆదివారం 2,423 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు ఏకంగా 14.97 శాతానికి పెరిగింది. ఇది జనవరి 22 నుండి అత్యధికం ఇదే అత్యధికమని ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో కోవిడ్-19 తో పోరాడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 22న ఢిల్లీ కరోనా సానుకూలత రేటు 16.4 శాతంగా ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 2,000 కంటే ఎక్కువగా నమోదుకావడం వరుసగా ఇది ఐదవ రోజు. వరుసగా ఏడు రోజుల పాటు సానుకూలత రేటు 10 శాతం కంటే ఎక్కువగానే ఉంది.
అంతకుముందు రోజు నిర్వహించిన 16,186 COVID-19 పరీక్షలలో ఆదివారం తాజా కేసులు వచ్చాయని ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. ఆదివారం నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు, మరణాలతో కలుపుకుని ఢిల్లీలో కోవిడ్-19 మొత్తం కేసులు 19,69,527 కు పెరిగాయి. వైరస్ తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 26,330 కు పెరిగింది. ఢిల్లీలో శనివారం 2,311 COVID-19 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.84 శాతం ఉన్నది. అలాగే, ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజు శుక్రవారం నాడు 12.95 శాతం పాజిటివ్ రేటుతో 2,419 కేసులను నమోదు చేయగా, ఇద్దరు వ్యక్తులు కోవిడ్-19 కారణంగా మరణించారు. గురువారం నాడు ఢిల్లీలో 11.84 శాతం సానుకూలత రేటుతో 2,202 కేసులతో పాటు, నాలుగు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక బుధవారం నాడు 2,073 COVID-19 కేసులు నమోదయ్యాయి. 11.64 శాతం పాజిటివ్ రేటు ఉండగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 25న ఆరుగురు ఈ వ్యాధి బారిన పడి మరణించిన తర్వాత బుధవారం నాటి మరణాల సంఖ్యనే అత్యధికం.
ఢిల్లీలో COVID-19 యాక్టివ్ కేసుల సంఖ్య 8,048కి చేరుకుంది. అంతకుముందు రోజు 7,349కి పెరిగింది. 5,173 మంది రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో COVID-19 రోగుల కోసం రిజర్వు చేయబడిన 9,407 పడకలలో, 464 ఆక్రమించబడ్డాయి. కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆరోగ్య కేంద్రాలలో పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నగరంలో 228 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ BA.4, BA.5 సబ్-వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ సమయంలో ఈ సంవత్సరం జనవరి 13 న ఢిల్లీలో రోజువారీ COVID-19 కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 28,867కి చేరుకుంది. జనవరి 14న నగరం 30.6 శాతం సానుకూలత రేటును నమోదు చేసింది. ఇది కోవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ సమయంలో అత్యధికం.