Asianet News TeluguAsianet News Telugu

corona virus : ముంబాయిలో మాస్క్ ధ‌రించని వారి నుంచి రూ.86 కోట్లు వ‌సూలు చేసిన బీఎంసీ

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి ముంబాయి పరిధిలో బృహ‌ణ్ ముంబాయి కార్పొరేషన్ ఇప్పటి వరకు రూ.86 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

Corona virus: Rs 86 crore collected from unmasked people in Mumbai
Author
Mumbai, First Published Jan 19, 2022, 3:54 PM IST

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే రోడ్ల‌పైన చాలా మంది జ‌నాలు మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. గుంపులు గుంపుల‌గా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ముచ్చ‌ట్లు పెడుతున్నారు. పెళ్లిల్లు,  ఫంక్ష‌న్లు అంటూ తిరుగుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం ఎన్ని ఆంక్ష‌లు అమ‌లు చేసినా ప్ర‌జ‌ల్లో మార్పు రాక‌పోతే అది వృథానే అవుతుంది. 

కోవిడ్ -19 వైర‌స్ 2019లో వెలుగులోకి వ‌చ్చింది. మ‌న దేశంలో దీని ప్ర‌భావం 2020 సంవ‌త్స‌రం మొద‌టి నుంచి క‌నిపించింది. అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వాలు క‌రోనాను నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని సూచిస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజేష‌న్ చేసుకోవాల‌ని తెలుపుతున్నాయి. అయినా వీటిని పాటించేవారు చాలా త‌క్కువ‌గా ఉంటున్నారు. కానీ కొన్ని ప్ర‌భుత్వాలు మాత్రం వీటిని క‌చ్చితంగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మాస్కు ధ‌రించ‌క‌పోతే ఫైన్లు విధిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. 

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఈ కోవ‌లేకే వ‌స్తుంది. మ‌హారాష్ట్రలో మొద‌టి వేవ్, రెండో లో నుంచే కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం కావ‌డం, ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్స్ ఉండ‌టం, ముంబై వంటి ప‌ట్ట‌ణాల్లో అధిక జ‌న సాంద్ర‌త ఉండ‌ట కేసులు అధికంగా పెర‌గ‌డానికి కార‌ణం. అయితే ఈ వేవ్ లో కూడా మొద‌టి నుంచీ మ‌హారాష్ట్రలో ముఖ్యంగా ముంబై ప‌ట్ట‌ణంలో కేసులు అధికంగానే వెలుగులోకి వ‌చ్చాయి. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఎక్క‌వ‌గానే న‌మోదవుతున్నాయి. అందుకే క‌రోనా క‌ట్ట‌డి కోసం ఆ రాష్ట్రం క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. ముంబై ప‌రిధిలో నైట్ క‌ర్ఫ్యూ, స్కూళ్లు, కాలేజీలు మూసివేత  వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దీంతో పాటు మాస్కు విధిగా ధ‌రించాల‌ని, లేక‌పోతే ఫైన్లు వేస్తామ‌ని కాస్త గ‌ట్టిగానే హెచ్చ‌రించాయి. వీటిని పాటించ‌ని వారిపై ఫైన్లు కూడా వేశాయి. 

మాస్కు ధ‌రించ‌ని వారిపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కొంచెం క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఫేస్ మాస్కులు ధరించని వారి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బృహ‌ణ్ ముంబాయి కార్పోరేష‌న్  ​రూ. 86 కోట్లకు పైగా జరిమానాలను వసూలు చేసింది. 2022 జ‌న‌వ‌రి 18 నాటి తాజా గ‌ణాంకాల ప్ర‌కారం ముంబై పోలీసులు, రైల్వేలు వసూలు చేసిన జరిమానాలతో పాటు మాస్కులు ధరించ‌నందుకు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 86,42,49,771 జరిమానా వసూలు చేసింది. ఇందులో బృహ‌ణ్ ముంబాయి కార్పోరేష‌న్  రూ. 69,03,69,971 వసూలు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు లేకుండా దొరికిన వ్యక్తుల నుండి ముంబై పోలీసులు  రూ. 16,91,01,600 జరిమానా రూపంలో వసూలు చేశారు. వెస్ట్రన్, హార్బర్, సెంట్రల్ అనే మూడు రైల్వే లైన్‌లను ఉల్లంఘించిన వారికి రూ. 47,78,200 జరిమానా విధించారు. ముంబై పట్ట‌ణంలోని ఆరు జోన్ల‌లోని, జోన్ నెంబ‌ర్ 4 ప్ర‌జ‌లు అధికంగా కోవిడ్ రూల్స్ ను ఉల్ల‌ఘించిన‌ట్టు తెలుస్తోంది. ఎందుంటే బీఎంసీ ఒక్క ఆ జోన్ లో అథ్య‌ధికంగా రూ. 12,68,36,000 జరిమానాను వసూలు చేసింది. తర్వాత జోన్ నెంబ‌ర్ 1 లో రూ. 1,203,49,500 జరిమానా విధించింది.

ఇదిలా ఉండ‌గా ముంబైలో మంగళవారం 6,149 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,011,967 కు పెరిగింది. అయితే ఇందులో 84 శాతం కేసుల్లో రోగుల్లో లక్షణాలు లేవు. ప్ర‌స్తుతం ముంబైలో రికవరీ రేటు 94 శాతంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios