corona virus : ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మాస్క్ వాడొద్దు - కేంద్రం తాజా మార్గదర్శకాలు
ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్లు సిఫారసు చేయరాదని ప్రభుత్వం తెలిపింది. మాస్క్ను సురక్షితంగా ఉపయోగించగలిగే 6-11 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు ధరించవచ్చని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది.
ప్రస్తుత కరోనా (corona) పరిస్థితుల దృష్యా పిల్లలు, టీనేజర్ల (18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున వారు) కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ సవరించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
పిల్లల మాస్క్ వాడకంపై కొత్త గైడ్ లైన్స్..
ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్ (masks) లు సిఫారసు చేయరాదని ప్రభుత్వం తెలిపింది. మాస్క్ను సురక్షితంగా, సముచితంగా ఉపయోగించగలిగే 6-11 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు మాస్క్ లు ధరించవచ్చని పేర్కొంది. అయితే 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పెద్దల మాదిరిగానే మాస్క్ను ధరించాలని సూచించింది. అలాగే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు యాంటీవైరల్ (anti viral), మోనోక్లోనల్ యాంటీబాడీస్ (monoclonal antibodies) వాడకూడదు.
యాంటీ మైక్రోబయాల్స్ వాడకంపై..
లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలు ఉన్న కోవిడ్ -19 పేషెంట్లకు చికిత్సలో రోగనిరోధకత కోసం యాంటీమైక్రోబయాల్స్ సిఫార్సు చేయకూడదు. స్వల్పమైన, తీవ్రమైన సందర్భాల్లో సూపర్యాడెడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీమైక్రోబయాల్స్ సిఫార్సు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
లక్షణాలు లేని, తేలిక పాటి లక్షణాలు ఉన్న కేసుల్లో స్టెరాయిడ్లు, ప్రతిస్కందకాలు వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా చేయడం చాలా హానికరమని పేర్కొంది. స్టెరాయిడ్లు హాస్పిటల్ లో చేరిన తీవ్రమైన, తీవ్ర అనారోగ్యంతో ఉన్న COVID-19 కేసులలో మాత్రమే సూచించాలని కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి. వీటిని ఐదు నుండి ఏడు రోజుల పాటు కొనసాగించవచ్చని చెప్పింది. రోజువారీ క్లినికల్ అసెస్మెంట్ ఆధారంగా 10-14 రోజుల వరకు వాడవచ్చని తెలిపింది. లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి మొదటి 3-5 రోజులలో స్టెరాయిడ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎందుకంటే ఇది వైరల్ షెడ్డింగ్ను పొడిగిస్తుందని తెలిపింది. కోవిడ్-19 సోకిన అనంతరం పిల్లల సంరక్షణకు సంబంధించిన వివరాలు కూడా ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. పిల్లలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత వారి శ్వాస కోశ ఇబ్బందులను ఎలా గమనించాలనే విషయంలో డాక్టర్లు సలహాలు ఇవ్వాలి. ఎలాంటి సందర్భాల్లో హాస్పిటల్ కు తీసుకురావాలో తల్లిదండ్రులు, లేదా సంరక్షులకు వివరించాలని అని మార్గదర్శకాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రస్తుతం మన దేశంలోకి వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చినా.. నెగెటివ్ వచ్చినా తప్పనిసరిగా ఏడు రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. కానీ సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పని సరి కాదు. ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ దేశమైనా.. రిస్క్ లేని దేశమైనా సరే అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాలో అడుగు పెట్టగానే ఒక వేళ కరోనా పాజిటివ్ అని తేలితే నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్రీట్మెంట్ అందించాలని తెలిపింది.