'ముఖ్యమంత్రే శివుడు.. ఆ రాష్ట్రాన్ని కరోనా ఏం చేయలేదు'
మధ్యప్రదేశ్ సీఎం శివుడేనని, కాబట్టి ఆ రాష్ట్రాన్ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ ఏడాదే 3.28 లక్షల మంది మరణించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
భోపాల్: కరోనా మహమ్మారిపై బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రే శివుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ను కరోనా ఎలా బాధించగలదు అని ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ వర్కర్లకు హెల్త్ కేర్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశంలోని హెల్త్ కేర్ సెంటర్లకు 135 కోట్ల టీకా డోసులు చేరుతాయని తెలిపారు. ఇదే సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ను కరోనా ఏమీ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ మధ్యప్రదేశ్ యూనిట్ ప్రెసిడెంట్గా విష్ణు దత్ శర్మ బాధ్యతల్లో ఉన్నారు.
తరుణ్ చుగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతలందరూ తమ పార్టీ క్యాడర్ నుంచి ప్రశాంసపూర్వక వ్యాఖ్యలే కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ ఆణిముత్యాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి భూపేంద్ర గుప్తా విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యకాలంలో 3.28 లక్షల మంది రాష్ట్రంలో కరోనాతో మరణించారని, అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని అన్నారు. 3,500 మంది బీజేపీ వర్కర్లే చనిపోయారని స్వయంగా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ విష్ణు దత్ శర్మనే వెల్లడించారని అన్నారు. ప్రపంచంలోని నియంతృత్వ శక్తులన్నీ తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తుంటాయని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేత విమర్శలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రజనీశ్ అగ్రవాల్ కౌంటర్ ఇచ్చారు. అవి వారి పేర్లేనని, వారిని అలాగే సంబోధిస్తారని కొట్టిపారేశారు.