కోరమండల్  ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో  దెబ్బతిన్న ట్రాక్  పునరుద్దరణ పనులు వేగంగా  సాగుతున్నాయి. 

భువనేశ్వర్:  ఒడిశాలో  రైలు ప్రమాదం జరిగిన బహానగ వద్ద   రైల్వేట్రాక్  పునరుద్దరణ పనులు సాగుతున్నాయి. ట్రాక్  పునరుద్దరణ పనుల్లో  వందలాది మంది కార్మికులు  పాల్గొంటున్నారు. గూడ్స్  రైలు పైకి ఎక్కిన  కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలింజన్ ను   అతి కష్టం మీద  తొలగించారు. ఈ ప్రమాదం  కారణంగా  రైల్వే పవర్ లైన్ ను పునరుద్దరిస్తున్నారు. ప్రమాదం  జరిగిన  ప్రాంతంలో  ట్రాక్ పునరుద్దరణ  పనులను  రైల్వే శాఖ మంత్రి ఆశ్విన్ వైష్ణవ్  పరిశీలించారు.

ట్రాక్ ల పునరుద్దరణ,  మృతుల గుర్తింపు  కోసం  ఎన్‌డీఆర్ఎఫ్, ఓడిఆర్ఎఫ్, రైల్వే బృందాలు  రాత్రంతా  శ్రమిస్తున్నాయి.   కేంద్ర ఆరోగ్య మంత్రి  ఒడిశాకు చేరుకున్నారు. ఆసుపత్రుల్లో  చికిత్స పొందుతున్న బాధితులను  పరామర్శించారు. వారికి అందుతున్న  వైద్య  సేవలను  ఆయన అడిగి తెలుసుకున్నారు. 

 మరో వైపు  ఢిల్లీకి  చెందిన ఎయిమ్స్  కు చెందిన  వైద్యుల బృందం  ఆదివారంనాడు  ఉదయం  ఒడిశాకు  బయలుదేరింది. రైలు ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులకు  చికిత్స అందించేందుకు వైద్యులు  ఒడిశాకు  బయలుదేరారు.ఈ ప్రమాదంలో  కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు  పైలెట్ మృతి చెందారు. అసిస్టెంట్  లోకో పైలెట్  ఐసీయూలో  చికిత్స పొందుతున్నాడు.