తన కొడుకు దోమ కుట్టడం వల్ల డెంగ్యూకు గురై మరణించాడని, దోమ కాటును యాక్సిడెంట్గా గుర్తించి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఓ తల్లి కలకత్తా కోర్టును ఆశ్రయించింది. ఈ వాదనలను ఇన్సూరెన్స్ కంపెనీ తిప్పికొట్టింది. ఉత్కంఠగా సాగిన ఈ విచారణలో చివరకు న్యాయమూర్తి పిటిషన్ను తోసిపుచ్చారు.
కోల్కతా: దోమ కుట్టి చనిపోయాడు. కాబట్టి దోమ కాటు ప్రమాదంగానే పరిగణించి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. దోమ కాటుకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తించదని చెబుతూ ఆ కంపెనీ పంపిన లేఖను రద్దు చేయాలి. తమకు ఇన్సూరెన్స్ డబ్బు అందించాలి.. ఇలా కోరుతూ ఓ మహిళ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఉత్కంఠగా సాగింది.
ఇండియన్ ఆర్మీలో పని చేసిన చాయన్ ముఖర్జీ తల్లి కోర్టులో పిటిషన్ వేసింది. కోల్కతాలోని కమాండ్ హాస్పిటల్లో చాయన్ ముఖర్జీ 2021 డిసెంబర్ 20వ తేదీన మరణించాడు. నవంబర్ 16న హాస్పిటల్లో అడ్మిట్ కాగా, మోకాలి గాయానికి సంబంధించి పోస్ట్ సర్జికల్ సమస్యలు వచ్చాయి. మూత్రపిండాల వ్యాధి చివరి దశలో ఉన్నట్టు తేలింది. ఇందుకు చికిత్స అందుతుండగా డిసెంబర్ 12వ తేదీన హై ఫీవర్ వచ్చింది. డెంగ్యూ వచ్చినట్టుగా గుర్తించారు.
తన కొడుకు అప్పటికే వ్యాధిగ్రస్తుడై ఉండగా కమాండ్ హాస్పిటల్లో చేర్చడం, అక్కడ దోమ కుట్టడం కారణంగా జ్వర తీవ్రత పెరిగి చనిపోయాడని, కాబట్టి, దోమ కాటును యాక్సిడెంట్గా గుర్తించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందించాలని ఆమె యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని కోరింది. కానీ, ఆ కంపెనీ తిరస్కరించింది. దోమ కాటును యాక్సిడెంట్గా పరిగణించలేమని వివరించింది.
చాయన్ ముఖర్జీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన దోమకాటు కారణంగా డెంగ్యూ రావడం వల్లే మరణించినట్టు, ఆయన మరణానికి దోమ కాటు ప్రధానంగా కనిపిస్తున్నదని ఆమె తరఫు లాయర్ వాదించారు.
ఇన్సూరెన్స్ కంపెనీ ఏఐ, ఎస్బీఐల మధ్య కుదిరిని ఒప్పంద రెనివల్ పత్రాల ఆధారంగా వాదించింది. అందులో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నిబంధనలకు ఈ కారణాలు లోబడటం లేదని తెలిపింది.
ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ విధంగా పేర్కొంది. పిటిషనర్ కొడుకు మరణాన్ని యాక్సిడెంట్ అనే వాస్తవ కోణంలో చూడాలని, అది నేరుగా సంభవిస్తుందని వివరించింది. బయటి నుంచి ఆ గాయం వస్తుందని, హింసాత్మకంగా, కంటికి కనిపించేదిగా ఉంటుందని తెలిపింది. ఆ యాక్సిడెంటే మరణం సంభవించేదిగా ఉండాలని పేర్కొంది. కానీ, ఈ కేసులో దోమకాటు కారణంగా డెంగ్యూ వచ్చి పరోక్షంగా ఆయనను ఇబ్బంది పెట్టిందని, ఆయన మరణానికి డెంగ్యూ ఒక్కటే కారణం కాదని, అదీ ఒక కారణం అని వివరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొంత వివరణ ఇస్తూ.. పాము కాటు, హై ఆల్టిట్యూడ్ ఇల్నెస్ ఇలా కొన్నింటిని మాత్రం యాక్సిడెంట్గా పరిగణిస్తారని తెెలిపారు.
మరో కేసును రిఫర్ చేసి చివరకు ఆ పిటిషన్ను సింగిల్ జడ్జీ బెంచ్ జస్టిస్ మౌషుమి భట్టాచార్య డిస్మిస్ చేశారు.
