రైతుల ఆందోళన: ముగిసిన ఆరో విడత చర్చలు.. కాస్త బెటర్ రిజల్ట్
నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు నెల రోజుల నుంచి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు కేంద్రం పలు విడతలుగా చర్చలు జరిపింది.
నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు నెల రోజుల నుంచి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు కేంద్రం పలు విడతలుగా చర్చలు జరిపింది.
అయితే ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపింది.
దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రుల బృందం ఆరో విడత చర్చలు ముగిశాయి. నాలుగు పాయింట్ల అజెండాపై దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చల్లో రెండు అంశాలపై పరస్పరం ఏకాభిప్రాయం కుదిరింది.
కానీ వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన వీడలేదు. దీంతో జనవరి 4న మరోసారి అన్నదాతలతో సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు.
పర్యావరణ ఆర్డినెన్స్, అలాగే, విద్యుత్ రాయితీల విషయంలో రైతు సంఘాల నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తోమర్ తెలిపారు. మరోవైపు, మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో చలిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులను ఇంటికి పంపాలని రైతు నేతలను కోరినట్టు కేంద్ర మంత్రి చెప్పారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోందని, ఇందుకోసం లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తోమర్ స్పష్టం చేశారు. అయితే, రైతు నేతలు మాత్రం ఎంఎస్పీని చట్టంలో చేర్చాలని పట్టుబడుతున్నారని ఆయన వెల్లడించారు.