Congress protest : పాఠ్యపుస్తకాల సవరణకు వ్యతిరేకంగా క‌ర్నాట‌క కాంగ్రెస్ యూనిట్ జూన్ 9, గురువారం బెంగళూరులోని విధాన్ సౌధలో నిరసన చేపట్టనుంది. ఉదయం 10 గంటల నుంచి నిరసన ప్రారంభమవుతుందని, ఎమ్మెల్యేలంతా ఆందోళనలో పాల్గొంటారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.  

Karnataka: కర్నాటకలో పాఠ్యపుస్తకాల సవరణపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ జూన్ 9, గురువారం ఉదయం 10 గంటలకు విధాన సౌధలో నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యను కాషాయ రంగులోకి మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరూ నిరసనలో పాల్గొననున్నారు. పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ పాఠశాల పుస్తకాల్లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగంపై పాఠాన్ని చేర్చడంతో కర్నాటక ప్రభుత్వం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలకు సంబంధించిన అధ్యాయాలను కూడా కమిటీ తొలగించిందని ఆరోపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాషాయీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్, కార్యకర్తలు, న్యాయవాదులు ఆరోపిస్తూ పాఠ్యపుస్తకాలను సవరించడంపై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో ఈ అంశంపై దుమారం చెలరేగింది. పాఠ్యపుస్తకాలలో సంఘ సంస్కర్త బసవన్న గురించి తప్పుగా వర్ణించడాన్ని సరిదిద్దాలని లింగాయత్ వ‌ర్గాలు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ కూడా రాశారు. అన్ని పాఠశాలల పాఠ్యపుస్తకాలను సర్క్యులేషన్ నుండి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ తన డిమాండ్లను తీవ్రతరం చేసింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు డికె శివకుమార్ మాట్లాడుతూ.. సవరించిన పాఠ్యపుస్తకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా మాట్లాడారని అన్నారు.

సమీక్షా కమిటీ చర్యలపై లింగాయత్ మఠాల సంఘం అధ్యక్షుడు బసవలింగ పట్టదేవర, సాణేహళ్లి పీఠాధిపతి పండితారాధ్య శివాచార్య స్వామీజీ, రచయితలు, కార్యకర్తలు, మఠాధిపతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో సంఘ సంస్కర్త బసవన్న గురించి తప్పుడు సమాచారం ఉన్న పాఠాన్ని సవరించడంలో విఫలమైతే ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయా వ‌ర్గాలు హెచ్చరించాయి. ఇదిలావుండగా, కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ANIతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ లక్ష్యం పాఠ్య పుస్తకం కాదు, ఎన్నికల కోసం సమస్యను రాజకీయం చేయడమే. గత 65 సంవత్సరాలుగా వారు విద్యార్థులకు తప్పుడు విషయాలు బోధిస్తున్నారు" అని అన్నారు. 

రాష్ట్రంలో పాఠ్యపుస్తకం స‌వ‌ర‌ణ‌ల‌తో వివాదం రగులుతున్న నేపథ్యంలో బొమ్మై పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీని రద్దు చేశారు. పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ నిర్దేశించిన పనులు పూర్తి కావడంతో దానిని రద్దు చేసినట్లు సీఎం బొమ్మై ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా అభ్యంతరకర కంటెంట్ ఉంటే తదుపరి సవరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. సంఘ సంస్కర్త బసవన్న వర్ణనపై లింగాయత్ సీర్లలోని ఒక వర్గం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 10వ తరగతి విద్యార్థులకు సవరించిన కన్నడ, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో బసవన్న బోధనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, సవరించిన పాఠ్యపుస్తకాల్లో బసవన్నపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని సరిచేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. 

పాఠశాల పాఠ్యపుస్తకాలపై పెరుగుతున్న వివాదంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ, పాఠ్యపుస్తకాలను మార్చడానికి మరియు పునర్ముద్రించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో చాలాసార్లు ఇలా మార్పులు చేశామని, సమస్యలు సృష్టించవద్దని, తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు.