Agnipath Protests: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహం.. 27న దేశవ్యాప్తంగా...
Agnipath Protests: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహించబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆ రోజున.. అన్నినియోజకవర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడుతారని ప్రకటించారు.
Agnipath Protests: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఓ అడుగు ముందుకేసింది. ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహించబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ బుధవారం ట్విట్ చేశారు. ఈ సత్యాగ్రహంలో దేశవ్యాప్తంగా అన్నినియోజకవర్గాల్లో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడుతారని తెలిపారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. INCIndia జూన్ 27న దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు & నాయకులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శాంతియుత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నారు అని కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
ఇక అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ను తక్షణమే వెనక్కితీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. స్వల్పకాలిక సైనిక నియామక పధకంతో కేంద్ర ప్రభుత్వం ఆర్మీని నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలకులు తొలుత ఒక ర్యాంక్, ఒకే పెన్షన్ గురించి మాట్లాడేవారు, కానీ, ఇప్పుడు వారు 'నో ర్యాంక్, నో పెన్షన్ తో ముందుకు వచ్చారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
చైనా సైన్యం మన దేశ సరిహద్దులో కూర్చుంటే.. కేంద్రం అవి ఏవీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, సైన్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి.. నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి హాని కలిగించే చర్య అని అన్నారు. కాషాయ నేతలు తమను తాము జాతీయవాదులుగా చెప్పుకుంటూనే.. దేశ భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని అన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లే, అగ్నిపథ్ పథకాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాల మోదీజీ వాపస్ తీసుకుంటారని తాను చెప్పాననీ, ఇప్పుడు ప్రధాని మోదీ అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ చెబుతోందని, దీనిపై యువత అంతా తమతో పాటు నిలుస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.