ఎన్నికల్లో వరుస పరాజయాలతో డీలా పడిన శ్రేణుల్లో తిరిగి జోష్ నింపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శివిర్ పేరుతో మూడు రోజుల పాటు మేధోమథనం నిర్వహిస్తోంది. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో ప్రక్షాళనపై ఇందులో చర్చించనున్నారు. 

కాంగ్రెస్ పార్టీ (congress party) ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రాజస్థాన్‌లోని ‘‘ చింతన్ శివిర్ ’’ ప్రారంభమైంది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. మిషన్ 2024 పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శిబిరం ద్వారా శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

ఈ చింతన్ శివిర్ కార్యక్రమం నేపథ్యంలో రాజస్తాన్ ఉదయ్‌పూర్ కాంగ్రెస్ లీడర్ అజయ్ మాకెన్ కీలక విషయాలు వెల్లడించారు. ఒక కుటుంబం ఒక టికెట్ రూల్‌కు కాంగ్రెస్ రెడీ అయింది. ఈ నిబంధనపై కాంగ్రెస్ ప్యానెల్‌కు ఏకాభిప్రాయం ఉన్నదని అజయ్ మాకెన్ వివరించారు. పార్టీ లీడర్‌కు తప్పితే వారి బంధువులకు టికెట్ ఇవ్వరాదనే నిబంధనకు నేతలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే, వారికీ టికెట్ ఇవ్వాలంటే వారు కనీసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పని చేసి ఉండాలని చెప్పారు. ఈ నిబంధన నుంచి గాంధీలకు మినహాయింపు ఉన్నదా? అని ప్రశ్నించగా.. వారు రాజకీయాల్లో ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారని, ప్రియాంక గాంధీ 2018 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారని వివరించారు.

Also Read:కాంగ్రెస్ ప్రక్షాళన షురూ.. ‘ఒక కుటంబం ఒక టికెట్’, ఏజ్ లిమిట్ రూల్!.. నేడు మేధోమథనం

ఈ నిబంధనతోపాటు కాంగ్రెస్ మరికొన్ని మార్పులు చేయబోతున్నది. రాజ్యసభ సభ్యుల ఎన్నికపైనా ఏజ్ లిమిట్ పెట్టనుంది. కాంగ్రెస్ పార్టీలో సగం మంది నేతలు 50 ఏళ్లకు లోబడే ఉండాలనే కండీషన్ పెట్టబోతున్నది. దేశంలో 60 శాతం మంది ప్రజలు 40 ఏళ్లలోపు వారేనని, కాబట్టి, తమ పార్టీ యూనిట్లూ సాధారణ ప్రజానీకాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మానిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ మేధోమథన కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నిబంధనలు పార్టీలో అమలు అవుతాయని నేతలు చెబుతున్నారు.

వీటితోపాటు ఈ మూడు రోజుల సదస్సులో వ్యవస్థాగత విషయాలతోపాటు, దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతపై చర్చ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 60 నుంచి 70 మంది ఉండబోతున్నారని తెలిసింది.