జాతీయ అంశాలపై కాంగ్రెస్ పోరు.. 9 మంది సభ్యులతో కమిటీ, ఉత్తమ్కు చోటు
జాతీయ అంశాలపై ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో ఈ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మరో ఆరుగురికి చోటు కల్పించింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అంశాలపై పోరాడాలని సోనియా నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సారధ్యంలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రిపున్ బోరా, మనీష్ చత్రాధ, బీకే హరిప్రసాద్ సహా పలువురిని సభ్యులుగా నియమించారు.
జాతీయ అంశాలపై రాజీలేని పోరాటాలను రూపొందించేందుకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని, సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తక్షణమే కార్యాచరణకు పూనుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ కమిటీలో ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబేర్ ఖాన్లు కూడా సభ్యులుగా ఉన్నారు. కాగా, సెప్టెంబర్ 20 నుంచి 30 వరకూ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సహా పలు అంశాలపై సంయుక్త ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కమిటీని నియమించింది.