హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు 30 మంది నాయకులపై కాంగ్రెస్ వేటు
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు ముందు కాంగ్రెస్ పార్టీ 30 మంది నాయకులపై వేటు వేసింది. రాబోయే ఆరేళ్ల పాటు 30 మంది నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించింది. కాగా, నవంబర్ 12 న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
Himachal Pradesh assembly election results: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 30 మంది నాయకులను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆరేండ్లపాటు వారిపై ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు కొన్ని గంటల ముందు కాంగ్రెస్ పార్టీ 30 మంది నేతలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు గ్రాండ్ ఓల్డ్ పార్టీ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి తామకే ప్రజలు అధికారం అప్పగిస్తారని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సోమవారం రాష్ట్రంలో అధికార బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేశాయి. అయితే, రాష్ట్రంలో వరుసగా ఏ పొలిటికల్ పార్టీ కూడా అధికారం దక్కించుకోకపోవడంతో బీజేపీ కాస్తా ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 59 చోట్ల 68 కౌంటింగ్ హాళ్లలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) మనీష్ గార్గ్ బుధవారం తెలిపారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షిస్తారు. స్థల లభ్యతకు లోబడి, కౌంటింగ్ హాళ్లలో సుమారు 8-14 టేబుళ్లను ఉంచుతామనీ, దాదాపు 500 పోస్టల్ బ్యాలెట్లను కలిగి ఉండటానికి ప్రత్యేక టేబుల్ ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) మనీష్ గార్గ్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం కంప్యూటర్లతో అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్లను స్కానింగ్ చేయడానికి ప్రత్యేక పట్టికలు కూడా ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు / పాస్ ఉన్నవారు మినహా కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల అభ్యర్థిని లేదా మరే ఇతర వ్యక్తిని అనుమతించరు. కాగా, నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 76.44 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.