కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: ఓట్లు వేసిన రాహుల్ గాంధీ, ఖర్గే.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గాంధీ కుటుంబంతో తనకున్న సంబంధం అలాగే ఉంటుందని అన్నారు. దాదాపు 22 ఏండ్ల తర్వాత పార్టీ కొత్త అధ్యక్షుని కోసం ఓటు వేస్తున్నందున ఈ రోజు చాలా చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు.
Congress President Election: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ పోలింగ్ బూత్లలో జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 9,000 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. దాదాపు 22 ఏండ్ల తర్వాత మొదటి సారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షున్ని ఎన్నుకోవడానికి ఈ పోలింగ్ కొనసాగుతుండటం చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ల చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పలువురు తమ ఓటును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ కూడా ఓటు వేశారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనున్న ఈ యాత్ర.. తమిళనాడు, కేరళ మీదుగా కర్ణాటక చేరుకుంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి భారత్ జోడో యాత్ర రానుంది. రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర క్యాంప్సైట్లో పార్టీ అధ్యక్ష పదవికి ఓటు వేశారు.
భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పీ.చిదంబరం, జైరాం రమేష్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు. ఓటు వేయడానికి ముందు, ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఈ క్షణం కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఓటు వేసే ముందు ఒక్కొక్కరుగా విధివిధానాలను పరిశీలించి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేశారు.
సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం తొలిసారిగా ఓటు వేశారు. వీరి వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు రమేష్, అజయ్ మాకెన్తోపాటు పలువురు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ తలపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, సీనియర్ నేతలు అంబికా సోనీ, వివేక్ తంఖా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ మాట్లాడుతూ, "కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నేను మిస్టర్ ఖర్గేతో మాట్లాడాను. ఏమి జరిగినా, మేము సహచరులం.. ముందుకూడా స్నేహితులుగా ఉంటాము" అని అన్నారు.