ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం నాడు ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓట్ల లెక్కింపు సాగుతుంది.మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ:ఎఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారంనాడు ఉదయం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.ఎఐసీసీ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు జరిగాయి .ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించారు. ఈ బాలెట్ బాక్సుల్లోని ఓట్లను కలిపి లెక్కిస్తున్నారు.ఎఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే,శశి థరూర్ లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో 9500 ఓట్లు పోలయ్యాయి.., దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 68 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా నిలిచారు.ఎఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా మధుసూధన్ మిస్త్రీ వ్యవహరిస్తున్నారు
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు .దీంతో ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు.గ ఎఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు గతంలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ పదవికి ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ మల్లికార్జున ఖర్గేకి గాంధీ కుటుంబం మద్దతు ఉంటుందని ప్రచారం పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పి.చిదరంబరం తనయుడు కార్తి చిదంబరం, అతుల్ చతుర్వేది,అతుల్ గైక్వాల్ శశిథరూర్ కు ఏజంట్లుగా ఉన్నారు.
పోలైన ఓట్లలో సగానికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించనున్నారు .24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆరు దఫాలు ఎన్నికలు జరిగాయి. మిగిలిన సమయంలో ఏకగ్రీవంగానే ఎన్నికలు ముగిశాయి.1998 నుండి నుండి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు.2017 నుండి 2019 వరకు రెండేళ్లు సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో లేరు.
ఈ దఫా సోనియా,రాహుల్ ,ప్రియాంకగాంధీలు అధ్యక్షపదవికి పోటీ చేయలేదు .రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో ఉండాలని పలు రాష్ట్రాల పీసీసీలు కోరినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు .కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం తెచ్చేందుకుగాను భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నారు.