ఐరాసకు పాక్ ఫిర్యాదు, పిటీషన్లో రాహుల్ పేరు: మోదీకి జై కొడుతూ దాయాదిపై కాంగ్రెస్ ఫైర్
ఇకపోతే రాహుల్ గాంధీ సైతం కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని దాంట్లో పాకిస్తాన్ తోపాటు ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చకు తెరలేపింది.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా పెదవి విప్పాల్సి వచ్చింది.
జమ్ముకశ్మీర్ పై తమ వాదాన్ని నెగ్గించుకునేందకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ పిటీషన్ దాఖలు చేసింది. ఆ పిటీషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లాగింది.
ఐరాసలో పాకిస్తాన్ దాఖలు చేసిన పిటీషన్లో రాహుల్ గాంధీ పేరును పొందుపరచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ తమ అబద్ధాల్ని, పిచ్చి ప్రేలాపనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి నీచపు పనులకు పాల్పుడుతోందని తిట్టిపోసింది.
కశ్మీర్, లఢక్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమేనని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. దీనిపై ప్రపంచంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా స్పష్టం చేశారు.
కశ్మీర్ లోయలో పాక్ హింసను ప్రేరేపిస్తోందంటూ మండిపడ్డారు. కశ్మీర్ పై పిచ్చి ప్రేలాపనలు మాని గిల్గిట్ బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచానికి పాక్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాలపై పాక్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2018లో 128 మంది అమాయకుల హత్యాకాండను ప్రపంచం అంతతా వీక్షించిందన్న విషయాన్ని పాక్ గుర్తుంచుకోవాలని తేల్చి చెప్పింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాక్ లోనే ప్రత్యక్షమవుతున్నాయంటూ విమర్శించారు రణ్ దీప్ సూర్జేవాలా
ఇకపోతే జమ్ముకశ్మీర్ విభజనను వ్యతిరేకించని కాంగ్రెస్ పార్లమెంట్ లో పెద్ద రచ్చే చేసింది. అంతేకాదు విభజన అనంతరం జమ్ముకశ్మీర్ విభజనకు వెళ్లి శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో వెనక్కి తిరగాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు. అంతేకాదు జమ్ముకశ్మీర్ విభజనను సమర్థిస్తూ పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆపార్టీకి వ్యతిరేకంగా మోదీని సమర్థించారు కూడా.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కశ్మీర్ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా తమ వైఖరిని స్పష్టం చేసినట్లైంది. ఇకపోతే రాహుల్ గాంధీ సైతం కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని దాంట్లో పాకిస్తాన్ తోపాటు ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చకు తెరలేపింది.