కరోనాతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ మృతి: పలువురి సంతాపం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాజీవ్ సతావ్ కరోనాతో ఆదివారం నాడు మరణించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాజీవ్ సతావ్ కరోనాతో ఆదివారం నాడు మరణించారు. కరోనా నుండి కోలుకొన్న కొద్ది రోజుల తర్వాత ఆయన ఇవాళ పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రాజీవ్ మరణం తమ పార్టీకి పెద్ద నష్టమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు.
కరోనా సోకడంతో ఆయన ఈ నెల 9వ తేదీన ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 16న ఉదయం కరోనా నుండి కోలుకొన్నారు. కానీ కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రాజీవ్ శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిన్నట్టుగా వైద్యులు చెప్పారు. ఈ కారణంగానే ఇవాళ ఉదయం ఆయన మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. 46 ఏళ్ల రాజీవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే శనివారం నాడు ప్రకటించారు. ఆదివారం నాడు తెల్లవారుజామున మరణించారు.రాజీవ్ మృతి పట్ల ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీలు వేర్వేరుగా సంతాపం తెలిపారు.