మోడీ ప్రధాని కాదు.. కార్పోరేట్ సంస్థలకు ఒక పరికరం: ప్రైవేటీకరణపై రాహుల్ విమర్శలు
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మోడీ ప్రధాని కాదని.. కార్పోరేట్ సంస్థలకు ఒక పరికరంలా మారారంటూ ఆయన విమర్శలు చేశారు. ప్రైవేటీకరణకు ఒక లాజిక్ వుండాలని .. కీలకమైన పరిశ్రమల్ని ప్రైవేటీకరించొద్దని ఆయన సూచించారు
ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో దూకుడుగా వెళుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేయాలని బీజేపీ నిర్ణయమని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రైవేటీకరణకు ఒక లాజిక్ వుండాలని .. కీలకమైన పరిశ్రమల్ని ప్రైవేటీకరించొద్దని ఆయన సూచించారు. కోట్ల మంది ప్రయాణించే రైల్వేను ఎందుకు ప్రైవేటీకరించాలని రాహుల్ ప్రశ్నించారు. రైల్వేలను తాము కీలక రంగంగా భావించామని.. నష్టదాయక సంస్థలనే తాము ప్రైవేటీకరించామని రాహుల్ గుర్తుచేశారు. అలాగే మార్కెట్ షేర్ తక్కువగా వున్న సంస్థలనే ప్రైవేటీకరించామన్నారు. మోడీ ప్రధాని కాదని.. కార్పోరేట్ సంస్థలకు ఒక పరికరంలా మారారంటూ ఆయన విమర్శలు చేశారు.