కేరళలో వందే భారత్ ఎక్స్ప్రెస్ పై కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ పోస్టర్లను అంటించారు. షోరనూర్ జంక్షన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ను సాధ్యం చేశాడని పొగుడుతూ ఆయన పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లు వేయడంపై తన అనుమతి లేదని సదరు ఎంపీ వివరణ ఇచ్చారు.
పాలక్కడ్: వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను పలు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తూ వస్తున్నారు. కేరళలోనూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. ఆ ట్రైన్ తిరువనంతపురం నుంచి ఉత్తరంవైపున ఉన్న కాసరగోడ్ జిల్లా వరకు వెళ్లుతుంది. ఈ ట్రైన్పై తాజాగా రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ పోస్టర్లు ఆ ట్రైన్పై అంటించడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రధాని మోడీ ప్రారంభించిన సెమీ హైస్పీడ్ ట్రైన్ షోరనూర్ జంక్షన్కు చేరుకోగానే.. అక్కడ కాంగ్రెస్ ఎంపీ శ్రీకందన్ను పొగుడుతూ పోస్టర్లు ఆ ట్రైన్పై అంటించారు. వందే భారత్ ట్రైన్ షోరనూర్ జంక్షన్లో హాల్టింగ్ను సాధ్యం చేశాడని కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ను పొగుడుతూ అనుచరులు పోస్టర్లు ట్రైన్కు అంటించారు. వందే భారత్ ట్రైన్ను స్వాగతిస్తూ ఎంపీ శ్రీకందన్, అతని అనుచరులు షోరనూర్ జంక్షన్లో ఉన్నారు. అప్పుడే ఆ ట్రైన్ పై ఎంపీ పోస్టర్లు అంటించారు. కాగా, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ పోస్టర్లు తొలగించిన దృశ్యాలను కొన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.
వందే భారత్ ట్రైన్ రాజధాని తిరువనంతపురంలో మొదలై కాసరగోడ్ వరకు వెళ్లుతుంది. ఈ మధ్యలో కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిస్సూర్, షోరనూర్ జంక్షన్, కోళికోడ్, కన్నూర్లలో ఆగుతుంది.
Also Read: సీఎం యోగికి బెదిరింపుల్లో లవ్ యాంగిల్.. గర్ల్ఫ్రెండ్ తండ్రి ఫోన్ దొంగిలించి..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఈ ఘటనను ఖండించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ పై పోస్టర్లు అంటించడాన్ని తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ వర్కర్ల పని అని పేర్కొన్నారు. ఒక ఎంపీ అనుచరులు ఇంతలా దిగజారి ఎలా వ్యవహరిస్తారు? అని ఫేస్బుక్ పోస్టులో ఆశ్చర్యపోయా రు.
దీనిపై ఎంపీ శ్రీకందన్ స్పందించారు. తన పోస్టర్లు అంటించాలని తాను ఎవరినీ ఆదేశించలేదని, ఎవరికీ అనుమతీ ఇవ్వలేదని వివరించారు. బీజేపీ కావాలనే ఈ పోస్టర్లను సాకు చేసుకుని వివాదాన్ని సృష్టించే పని చేస్తున్నదని తెలిపారు.
