"రాహుల్ రాముడిలా కనిపిస్తున్నాడు" : కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
దేశం విచ్ఛిన్నం కాకూడదనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్నారని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమన్వయకర్త సల్మాన్ ఖుర్షీద్ (కాంగ్రెస్) అన్నారు. ఈ పర్యటన ఉద్దేశ్యం రాజకీయం కాదని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీని రాముడితో, తనను భారత్తో పోల్చారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు మంచి ప్రజాదరణ వస్తుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ.. రామాయణ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. వాస్తవానికి హిందువులను, హిందుత్వాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. కానీ, తాజాగా.. రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులను ‘భారత్’ (భరతుడు) అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని రాముడితో పోల్చుతూ పొగడ్తలతో ముంచెత్తారు. రాముడి ‘ఖదౌ’ చాలా దూరం వెళుతుంది. కొన్నిసార్లు ‘ఖదౌ’ పట్టుకుని రామ్ జీ చేయలేని ప్రదేశాలకు భరతుడు వెళ్తాడు. భారతుడు లాగానే మేము యూపీకి చేకున్నాం. ఇప్పుడు ‘ఖదౌ’ యూపీకి చేరుకుంది. రామ్ జీ (రాహుల్ గాంధీ)కూడా వస్తాడు,” అని కుర్షిద్ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఒక యోగిలాగా తన తపస్సు చేస్తున్నాడని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభంలో అనుకున్నట్టు కాకుండా.. తన రూట్ మ్యాప్లో లేని ఉత్తర ప్రదేశ్ లో కూడా యాత్ర సాగుతుందని తెలిపారు. ఇక..రాహుల్ గాంధీ మానవాతీతుడని, గడ్డ కట్టే చలిలో మనం వెచ్చని జాకెట్లు వేసుకుని ఇంట్లోనే ఉంటేనే.. రాహుల్ గాంధీ మాత్రం టీ-షర్టుతో (భారత్ జోడో యాత్ర కోసం)బయటకు వెళ్తున్నాడని అన్నారు. రాహుల్ గాంధీ ఓ యోగిలాగా ఏకాగ్రతతో ‘తపస్సు’ చేస్తున్నాడని ఖుర్షీద్ అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
సల్మాన్ ఖుర్షీద్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురుస్తోంది. రాముడి ఉనికిని నిరాకరించిన వారు ఎప్పటి నుండి రామభక్తులుగా మారారని ఓ యూజర్ ఏద్దేవా చేశారు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ప్రియమైన దేశప్రజలారా, రాహుల్ జీకి చలిగా అనిపించడం లేదు, కాబట్టి ఆయనను ప్రధానమంత్రిని చేయాలి అని కామెంట్ చేశారు. రాముడిని ఊహాజనితంగా పిలిచే వారు కూడా రాముడిని గుర్తుంచుకున్నారని, మోడీ ఏమి చేసారని ప్రజలు అడిగారని కామెంట్ చేశారు. ఖుర్షీద్ సాహబ్కి రామాయణం గురించి మంచి జ్ఞానం ఉందని తెలుసుకోవడం మంచిదని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఖుర్షిద్ వ్యాఖ్యలపై బీజేపీ అసహనం
మరోవైపు.. సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యలపై బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీని శ్రీరాముడితో, తనను భారత్తో సల్మాన్ ఖుర్షీద్ పోల్చారని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా అన్నారు. ఇది షాకింగ్ స్టేట్మెంట్. అతను ఎవరినైనా ఇతర మతాల దేవుళ్లతో పోల్చడానికి సాహసిస్తాడా? రామ్ జీ ఉనికిని నిరాకరించడం, రామమందిరాన్ని ఆపడం ఇప్పుడు హిందూ విశ్వాసాన్ని అవమానించడమే. జానేధరి రాహుల్ దీనికి అంగీకరిస్తుందా? అని పూనావలా ట్విట్టర్లో పేర్కొన్నారు.
యాత్ర ప్రారంభంలో..
భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు.. రాజస్థాన్ మంత్రి పార్సాది లాల్ మీనా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని శ్రీరాముడి కంటే గొప్ప అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారని, ఆయన రాముడి కంటే ఎక్కువగా నడుస్తున్నారని మీనా అన్నారు. త్రేతాయుగంలో వనవాస సమయంలో రాముడు కూడా అంత దూరం ప్రయాణించలేదని అన్నారు. రాముడు అయోధ్య నుంచి శ్రీలంక వరకు నడిచాడని, అలాగే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే చారిత్రాత్మక పాదయాత్ర అని అన్నారు. దేశంలో మతవాద వాతావరణం నెలకొందని, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే పని రాహుల్ గాంధీ చేయబోతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇంత సుదీర్ఘ పాదయాత్రను ఎవరూ.. ఎప్పుడూ .. చేయలేదనీ, భవిష్యత్తులో కూడా ఎవరూ చేపట్టాలేరని అన్నారు.
రాజస్థాన్ మంత్రి మీనా చెప్పిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సమర్ధించారు. అయితే "రామ్ , రాహుల్ గాంధీల పేర్లు ' ఆర్' అక్షరంతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికమని అన్నారు. రాముడు,రాహుల్లను పోల్చలేమని ఆయన అన్నారు. "రాముడు దేవుడనీ, రాహుల్ గాంధీ మానవుడని పేర్కొన్నారు. అయితే పటోల్ వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు. "రావణ్ కూడా ఆర్ అక్షరంతోనే మొదలవుతుంది" అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.