విశ్వాసఘాతకుడు అంటూ అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు.. బాధపడ్డానన్న సచిన్ పైలట్
తనను విశ్వాసఘాతకుడు అంటూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తానూ మనిషినేనని , తానూ బాధపడతానని పేర్కొన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వున్న సంగతి తెలిసిందే. ఇటీవల పరిస్ధితి చక్కబడుతున్న దశలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మళ్లీ ఇద్దరి మధ్య చిచ్చుబెట్టాయి. అశోక్ రాజీనామా చేసుంటే ఖచ్చితంగా సచిన్ సీఎం అయ్యేవారు. కానీ పెద్దాయన పట్టువీడకపోవడంతో రాజస్థాన్ కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువయ్యాయి. తాజాగా సచిన్ పైలట్ మాట్లాడుతూ... రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన, తానూ మనిషినేనని అన్నారు.
ఇటీవల తనను కొన్ని వ్యాఖ్యలు బాధించాయని, అయితే మళ్లీ గతంలోకి తొంగిచూడాలని భావించట్లేదని సచిన్ వ్యాఖ్యానించారు. తనను విశ్వాసఘాతకుడు అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పైలట్ పై విధంగా కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ప్రస్తుతం తన కర్తవ్యమని సచిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలు ఎవరి చేతుల్లో పెట్టాలన్నది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ALso REad:రాజస్థాన్లో భారత్ జోడో యాత్ర.. ధాబాలో టీ తాగుతూ.. పిల్లలతో కబుర్లు చెప్పిన రాహుల్ గాంధీ...
కాగా కొద్దిరోజుల క్రితం అశోక్ గెహ్లాట్ మాట్లాడతూ.. సచిన్ను విశ్వాస ఘాతకుడు అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అతను ఎప్పటికీ సీఎం కాలేడని, పార్టీ హైకమాండ్ కూడా ఆయనను ముఖ్యమంత్రిగా చేయదని అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.