భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..!
అక్కడ భక్తుల బూట్లు తుడవడంతోపాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఈ ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తన మాట నిలపెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. గురుద్వారలో భక్తుల బూట్లు తుడిచి.. ప్రార్థనా మందిరాన్ని చీపురుతో తుడిచి శుభ్రం చేశారు. సిక్కుల పవిత్రమైన ఓ పదాన్ని ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తాను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ ప్రకటించిన రావత్.. ఇందులో భాగంగా శుక్రవారం తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ లోని నానక్ మిట్టలోని గురుద్వారాను ఆయన సందర్శించారు.
అక్కడ భక్తుల బూట్లు తుడవడంతోపాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఈ ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
గతవారం పంజాబ్ లో పర్యటించిన హరీశ్ రావత్ అక్కడ నవజోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలోని పార్టీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చండీగఢ్ పర్యటనకు వెళ్లిన హరీశ్ రావత్.. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్దూ, మరో నలుగురు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను ఉద్దేశిస్ూత వారిని సిక్కుల పవిత్ర పదంతో పోల్చడం వివాదాస్పదమైంది.
అవి సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు చెప్పిన రావత్.. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ఫేస్ బుక్ లో ప్రకటించారు.
‘కొన్నిసార్లు మర్యాద, గౌరవాన్ని వ్యక్తపరిచే క్రమంలో కొన్ని పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. నేను అలాగే ఆ పవిత్ర పదాన్ని వాడి తప్పు చేశాను. వారి మనో భావాలను బాధపెట్టినందుకు వారికి క్షమాపణలు చెబుతున్నా. సిక్కుల సంప్రదాయం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా గురుద్వారలో కరసేవ చేస్తాను’ అని ఆయన ప్రకటించారు. చెప్పినట్లుగానే సేవ చేశారు.