రాజకీయాల్లో తన ప్రస్థానం ముగిసిందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది . సోనియా రాజకీయాల్లోనే వుంటారని, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే తనకు సంతోషంగా వుందని ఆమె అన్నారని కుమారి సెల్జా పేర్కొన్నారు.

రాయ్‌పూర్‌లో జరుగుతున్న 85వ ఏఐసీసీ ప్లీనరీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా అర్ధం వచ్చేలా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే తనకు సంతోషంగా వున్నట్లు సోనియా చెప్పారని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు. రాజకీయాలకు దూరమవుతున్నట్లు సోనియా ఎక్కడా చెప్పలేదని ఆమె వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఉద్దేశం సోనియా గాంధీకి లేదని సెల్జా స్పష్టం చేశారు. 

అంతకుముందు సోనియా గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. ‘‘2004, 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంతో సాధించిన విజయాలు నాకు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ కు కీలక మలుపు అయిన భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుంది’’ అని సోనియా గాంధీ అన్నారు. ఆమె తన ప్రసంగంలో అధికార బీజేపీ గురించి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ ఒక్క సంస్థను కాషాయ పార్టీ బంధించి, నాశనం చేస్తోందని విమర్శించారు. ‘‘ఇది కాంగ్రెస్ కు, దేశం మొత్తానికి సవాలుతో కూడిన సమయం. దేశంలోని ప్రతీ ఒక్క సంస్థను బీజేపీ-ఆరెస్సెస్ ఆక్రమించుకున్నాయి. కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక వినాశనానికి కారణమైంది.’’ అని అన్నారు.

ALso Read: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది - సోనియా గాంధీ

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీని ఓడించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని తమ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీని ప్రజావ్యతిరేక పార్టీగా అభివర్ణించిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు త్యాగాల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని ఖర్గే పునరుద్ఘాటించారు. చైనా సరిహద్దు చొరబాట్లు, ప్రాదేశిక వివాదాలపై పదేపదే జరుగుతున్న చర్చను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలపై నిరంతర దాడి, చైనాతో సరిహద్దులో జాతీయ భద్రత సమస్యలు, ఆల్ టైమ్ అధిక ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయిలో నిరుద్యోగం వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సమర్థమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.