హోంమంత్రి రాజీనామాకు రాహుల్ డిమాండ్: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, డీఎంకె, శివసేన ధర్నా
పెగాసెస్ అంశంపై శుక్రవారం నాడు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, డీఎంకె, శివసేన ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ ను కేంద్రం తన రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకొందని రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: పెగాసెస్ సాఫ్ట్వేర్ ను కేంద్రం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.పెగాసెస్ అంశంపై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, శివసేన, డీఎంకె ఎంపీలు శుక్రవారం నాడు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెగాసెస్ అంశంపై జ్యూడీషీయల్ విచారణ జరిపించాలని ఆయన కోరారు. విపక్షాలను ఇబ్బందిపెట్టేందుకు ఈ సాఫ్ట్వేర్ ను కేంద్రం ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. ఈ సాఫ్ట్ వేర్ ను రాజకీయ నేతల తో పాటు పలువురి ఫోన్లను హ్యాక్ చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు.
గత మూడు రోజులుగా పార్లమెంట్ ఉభయసభలను పెగాసెస్ అంశం కుదిపేస్తోంది.ఈ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగుతున్నారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గడంతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు వాయిదాపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే పెగాసెస్ అంశంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.ఈ కథనాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది.