బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు తాము పలు చోట్ల బలహీన అభ్యర్థులను బరిలోకి దింపామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కొట్టిపారేశారు.
లక్నో: బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు తాము పలు చోట్ల బలహీన అభ్యర్థులను బరిలోకి దింపామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కొట్టిపారేశారు.
బలహీన అభ్యర్థులను బరిలోకి దింపామని ప్రియాంక వాదనను తాము నమ్మబోమన్నారు. ఏ పార్టీ కూడా బలహీన అభ్యర్థులను పోటీకి దింపబోదని, వారి వద్ద ప్రజాబలం లేనందునే ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమి కాంగ్రెస్ బీ-టీమ్ అంటూ వస్తున్న విశ్లేషణలను కూడా ఆయన ఖండించారు. కాంగ్రెస్- బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
యూపీలో అధికార బీజేపీని గట్టి దెబ్బతీసేందుకే తాము కూటమిగా చేతులు కలిపామని అఖిలేష్ చెప్పారు.. తదుపరి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచే వస్తారని అఖిలేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫలితాలు వచ్చాక ఈ విషయమై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. నేతాజీకి ప్రధానిగా గౌరవం లభించడం కంటే ఆనందం తనకేమీ ఉండదన్నారు. అయితే ములాయం ప్రధాని రేసులో ఉన్నారని వ్యక్తిగతంగా తాను భావించడం లేదని తెలిపారు.ఇదిలా ఉంటే తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
