కశ్మీర్లో వెల్లివిరిసిన మతసామరస్యం.. ఆలయంలో నిర్వహించిన మహా యజ్ఞంలో పాల్గొన్న బుడ్గాం డిప్యూటీ కమిషనర్ హమీద్
కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలో ఓ ఆలయంలో నిర్వహించిన మహా యజ్ఞంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ఎఫ్ హమీద్ స్వయంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన స్వయంగా పాల్గొని భక్తులతో కలిసిపోయారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆ ఆలయంలో మళ్లీ యజ్ఞం నిర్వమించారు.
![communal harmony in kashmir as DC SF Hamid joins maha yagya event in hindu temple kms communal harmony in kashmir as DC SF Hamid joins maha yagya event in hindu temple kms](https://static-ai.asianetnews.com/images/01gz8b51ksce6tjvc3qnas19ez/asianet-news-tamil---2023-04-30t111414-978_363x203xt.jpg)
బుడ్గాం: కశ్మీర్లో మతసామరస్యం వెల్లివిరిసింది. హిందూ పండిట్లు ఓ ఆలయంలో నిర్వహించిన మహాయజ్ఞంలో బుడ్గాం డిప్యూటీ కమిషనర్ ఎస్ఎఫ్ హమీద్ హాజరయ్యారు. హోమం జరిగినప్పుడూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలో హిందూ కమ్యూనిటీ రెగెన్య మాతా ఆస్థాపన్ ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ ఆలయంలో మళ్లీ మహాయజ్ఞం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై డీసీ ఎస్ఎఫ్ హమీద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని, కశ్మీర్లో సౌభ్రాతృత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. హమీద్ 2017 ఐఏఎస్ అధికారి. అసోం, మేఘాలయా క్యాడర్కు చెందిన ఈయన డిప్యూటేషన్ మీద స్వరాష్ట్రానికి వచ్చారు.
ఆలయంలో ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని డీసీ హమీద్ జిల్లా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని మొత్తం కశ్మీరీ పండిట్ల తరఫున ఆయన ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినందుకు, ఇందులో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి తోడ్పడ్డారని వివరించారు.
1989 తర్వాత ఈ ఆలయంలో మళ్లీ హోమం జరగడం ఇదే ప్రథమం.