కాశ్మీర్ ను వణికిస్తున్న చలి.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Kashmir: జమ్మూకాశ్మీర్ లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. స్కీయింగ్ రిసార్ట్ గుల్మార్గ్ లో -9 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శ్రీనగర్ లో శనివారం రాత్రి 1.0 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రత ప్రస్తుతం మైనస్ 3.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Weather update: దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ లో చలిగాలులు వీయడం పెరిగింది. మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గుల్మార్గ్ స్కీయింగ్ రిసార్ట్ లో మైనస్ 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో కాశ్మీర్ అంతటా కనిష్ఠ ఉష్ణోగ్రత మరింత తగ్గిందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం, మంచు కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి కాశ్మీర్ లో ప్రతికూల వాతావరణం అలుముకుంది. శ్రీనగర్ లో శనివారం రాత్రి 1.0 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రత ప్రస్తుతం మైనస్ 3.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. లోయకు ముఖద్వారమైన ఖాజీగుండ్ లో మైనస్ 1.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కాశ్మీర్లోని కోకర్నాగ్ లో మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.9 డిగ్రీలకు పడిపోయిందని అధికారులు తెలిపారు.
బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 9.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ప్రసిద్ధ స్కీ రిసార్ట్ జమ్మూ కాశ్మీర్ లో అత్యంత శీతల ప్రదేశం, వార్షిక అమర్ నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ గా పనిచేసే పహల్గామ్ లో మైనస్ 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతంలో శుక్రవారం మినహా మరో ఐదు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సోమవారం నుంచి బుధవారం వరకు మరింత తీవ్రతతో వర్షాలు కురుస్తాయని, కాశ్మీర్ మైదాన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, మధ్య, ఎగువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ మంచు కురిసే అవకాశం ఉందనీ, జమ్మూలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హిమపాతం ఎక్కువగా, తరచుగా సంభవించే 40 రోజుల కఠినమైన వాతావరణ కాలం 'చిల్లాయ్ కలాన్' గుప్పిట్లో కశ్మీర్ ఉంది. చిల్లై కలాన్ డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 30న ముగుస్తుంది. ఆ తర్వాత కూడా 20 రోజుల 'చిల్లాయ్ ఖుర్ద్', 10 రోజుల పాటు 'చిల్లాయ్ బచ్చా' అంటూ చలిగాలులు కొనసాగుతూనే ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో కూడిన ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో రానున్న కొద్ది రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత వారం వరకు ఈ ప్రాంతమంతా శీతాకాలపు వర్షాలు కురవలేదు. దీంతో ఈ ప్రాంతం అంతటా 90 శాతానికి పైగా కొరత ఏర్పడింది. జనవరి 19, 20 తేదీల్లో మంచి వర్షాలు కురవడంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ మినహా 10-20 శాతం లోటు తగ్గిందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.