ఎయిర్ విస్తారా భోజనంలో బొద్దింక.. ఎయిర్ లైన్స్ సంస్థ ఏం చెప్పిందంటే..?
Air Vistara airline: ఎయిర్ విస్తారా భోజనంలో బొద్దింక వచ్చిన సంఘటన గురించి ఒక ప్రయాణీకుడు ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ దీని గురించి వెల్లడించారు. ఎయిర్ విస్తారా వెంటనే స్పందించి.. సదరు ప్రయాణికుడి నుంచి మరిన్ని వివరాలను కోరింది.
Cockroach In Meal: ఇటీవల ఒక విమానయాన సంస్థ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఏకంగా పాలు తల రావడం సంచలనం రేపింది. ఇదే తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విమాన సిబ్బంది ఒక ప్రయాణికుడికి అందించిన భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ విషయాన్ని సదరు ప్రయాణికుడు ఫోటో తీసి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఘటన ఎయిర్ విస్తారా విమానంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఎయిర్ విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక ప్రయాణికుడు.. తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఖాతాలో, తనకు అందించిన ప్యాక్డ్ ఫుడ్ (ఆహారంలో) బొద్దింకను కనిపించిన దృశ్యాలను పంచుకున్నారు. ఎయిర్ విస్తారా తనకు అందించిన భోజనంలో చిన్న బొద్దింక వచ్చిందని పేర్కొంటూ దానికి సంబంధించిన ఫొటోలను నికుల్ సోలంకి షేర్ చేశారు. సోలంకి తన ప్రయాణంలో చేసిన భోజనంకు సంబంధించిన చిత్రాల్లో ఇడ్లీ సాంబరు, ఉప్మా కనిపించాయి. ఆహారం లోపల బొద్దింక ఉన్న దృశ్యాలు మరో ఫొటోలో జూమ్ చేసి చూపించాడు.
ఈ ట్వీట్ చేసిన పది నిమిషాల తర్వాత ఎయిర్ విస్తారా స్పందించింది. తన ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ ద్వారా సంబంధిత అంశంపై స్పందిస్తూ దానికి సంబంధించిన పూర్తి వివరాలను పంచుకోవాలని కోరింది. "హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డాయి. దయచేసి మీ ఫ్లైట్ వివరాలను తెలియజేయగలరు. తద్వారా మేము విషయాన్ని పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా దానిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాము.. ధన్యవాదాలు" అని ఎయిర్ విస్తారా ఎయిర్ లైన్స్ ట్విట్టర్ హ్యాండిల్ శీఘ్ర పేర్కొన్నారు.
కాగా, ఎయిర్ విస్తారాను ఎయిర్ ఇండియాలో వీలినం చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారతదేశానికి చెందిన టాటా గ్రూప్ లో రహస్య చర్చలు జరుపుతున్నట్లు పలు మీడియా కథనాలు గురువారం నాడు పేర్కొన్నాయి. ఎస్ఐఏ, టాటాల మధ్య ప్రస్తుతం ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చలు ప్రయత్నిస్తున్నాయననీ, ఎయిర్ విస్తారా-ఎయిరిండియాల సంభావ్య ఏకీకరణను కలిగి ఉండవచ్చని సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయనీ, ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. ఎయిర్ విస్తారాను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఎ ఎయిర్ లైన్స్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా భారతీయ సమ్మేళన సంస్థ యాజమాన్యంలో ఉంది. అయితే, దీనిపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు.