నాల్గో తరగతి విద్యార్థి మీద విచక్షణా రహితంగా టీచర్ దాడి చేయడంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటక : పిల్లలన్నాక అల్లరి చేస్తారు.. ఆటలాడతారు. ఇక స్కూల్లో తన తోటి పిల్లలు కనిపించగానే ఆనందం, ఉత్సాహం ఎక్కువవుతాయి. ఇంకాస్త అల్లరి పెరుగుతుంది. ఆటలు, పాటలతో పాటు ఫైట్లు, గొడవలు కూడా ఉంటాయి. వారిని నయానో, భయానో బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలి.. అంతేకానీ.. గొడవ చేస్తున్నారని మొత్తం కోపాన్ని వారి మీద చూపిస్తే.. ఆ చిన్నారి ప్రాణాలు తట్టుకోలేవు.. అలాంటి దారుణమే జరిగింది.. కర్ణాటక రాష్ట్రం నరగుండ తాలూకా హద్ది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో.. తరగతి గదిలో పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు. ఇది ముత్తప్త హడగలి అనే ఉపాధ్యాయుడికి చికాకు తెప్పించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో పట్టరాని కోపంతో ఇనుప ఊచతో విద్యార్థులను విచక్షణా రహితంగా చితకబాదాడు. అప్పటివరకు అల్లరి చేసిన చిన్నారులు.. ఆ దెబ్బలు తాళలేక అరుపులు, కేకలు, ఏడుపులు మొదలు పెట్టారు. ఈ హంగామాకు అక్కడికి వచ్చిన మరో టీచర్ అలా కొట్టడాన్ని అడ్డుకోబోయింది. అప్పటికే కోపం దయ్యం పూనిన అతను టీచర్ మీద కూడా దాడికి దిగాడు. అలా అతను కొట్టిన దెబ్బలకు నాల్గో తరగతి చదువుతున్న భరత్ (10) తట్టుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్కూల్లోని మిగతావారు వచ్చి ఆ ఉన్మాది టీచర్ ను అదుపుచేసి.. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. 

అతివేగంతో ఆటోను ఢీకొట్టిన‌ బైకు.. ముగ్గురు స్పాట్ డెడ్

చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకువెడుతుంటూనే మధ్యలోనే భరత్ ప్రాణాలు కోల్పోయాడు. ముత్తప్ప దాడిలో గాయపడిన లేడీ టీచర్ ను హుబ్బళ్లిలోని మరో ఆస్పత్రికి తరలించారు. దాడి విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వారు స్కూలు మీదికి వచ్చారు. దీనికి కారణమైన ముత్తప్పకు దేహశుద్ధి చేశారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. అయితే, చనిపోయిన విద్యార్థి భరత్ తల్లే ఆ లేడీ టీచర్ అని సమాచారం. ఇక ముత్తప్ప ఆ స్కూల్లో గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు.