బీజేపీతో సహా అన్ని పార్టీలూ ఉచితాలకే మొగ్గు.. ఏది ఉచితమో? ఏది సంక్షేమమో? తేల్చడం కష్టమన్న 'సుప్రీం'
బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా దీనిని పరిష్కరించేందుకు న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని అన్నారు. పార్టీలు అటువంటి హ్యాండ్అవుట్ల వాగ్దానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీల విషయంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అధికార బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఒకే పక్షాన ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని రాజకీయా పార్టీలన్నీ ఉచితాలకు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది.అయితే.. వాటిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నికల సందర్భంగా పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై చర్చించిన సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.
సంక్షేమ చర్యలు అట్టడుగున ఉన్న ప్రజలను ఉద్ధరించడానికేనని, వాటిని ఉచితాలుగా నిర్వహించలేమని, ఉచితాల సమస్యపై న్యాయపరమైన జోక్యానికి సంబంధించి ప్రకటనలు చేసినందుకు ద్రావిడ మున్నేట్ర కజగం (DMK), దాని నాయకులలో కొంతమందికి సుప్రీంకోర్టు చురకలంటించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను సింగపూర్, హాంకాంగ్ లేదా బ్యాంకాక్కు తీసుకెళ్తామని ఒక పార్టీ హామీ ఇస్తే.. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు.. పేదలు, మహిళలకు సైకిళ్లు, మత్య్స కారులకు పడవలు పంపిణీ చేస్తున్నాయి. పడవలు లేదా సైకిల్స్ వంటి చిన్న విషయాలు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయని, వీటి వల్ల అనేక మంది జీవితాలు మెరుగుపడ్డాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం ఏయే సౌకర్యాలు కల్పించాలి, అనవసరమైన ఉచితాలేమిటో తీవ్రంగా పరిగణించాలి. ప్రధానంగా ఇక్కడ ఏది ఉచితాలు, ఏది కాదనేదే సమస్య. కాబట్టి.. మనం ఇక్కడ కూర్చొని దీనిపై వాదనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఉచితాల అంశంపై బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయని చెప్పగలననీ, అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలను కోరుకుంటున్నాయనీ.. ఈ అంశంపై విస్తృత స్థాయిలో బహిరంగ చర్చ జరగాలని అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనం కోసం.. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బెంచ్ చూసించిందని తెలిపారు. ఏది ఉచితం.. ఏది సంక్షేమమో చూడాలని అన్నారు. ఈక్విటీని బ్యాలెన్స్ చేయాలని, ధర్మాసనం ప్రభుత్వ విధానానికి లేదా పథకాలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా న్యాయస్థానం వద్దకు వచ్చి.. తాము పథకం లబ్ధిదారులం కాదా? అని ప్రశ్నిస్తే.. కోర్టు సమాధానం చెప్పేలా ఉండాలని అన్నారు. కోర్టు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదనీ, ఏ పథకాలను కూడా కోర్టు వ్యతిరేకించదని పేర్కొన్నారు.
పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. ‘నీరు, వైద్యం, విద్య వంటి సౌకర్యాలు మాత్రమే ప్రభుత్వం కల్పించాలనీ, పన్ను చెల్లింపుదారులపై భారం పెంచే చర్యలను ఏ పార్టీ చేపట్టిన వాటిని అనుమతించకూడదనీ, పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేయకూడదని తెలిపారు. ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యమనీ, తన అధికారాలను సక్రమంగా వినియోగించుకుంటే లేదా చట్టం ద్వారా అదనపు అధికారాలు ఇస్తే ఈ విషయాలను అరికట్టవచ్చని తెలిపారు.
ఈ విషయంపై పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేయాల్సిన ప్రకటనల అంశాన్ని మాత్రమే తాను లేవనెత్తానని తెలిపారు. ఎస్ సుబ్రమణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పులో పార్టీల ఎన్నికల మేనిఫెస్టోపై నియంత్రణ గురించి ప్రస్తావించింది. కానీ ఎన్నికల సంఘం దీనిపై పెద్దగా కసరత్తు చేయలేదని తెలిపారు.
ఈ సందర్భంగా సభ్య ధర్మసనానికి సహకరించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ..
చట్టబద్ధమైన ఆర్థిక సంఘం యొక్క ప్యానెల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రతిపాదించారు. ఫిస్కల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ చట్టం ప్రకారం కొన్ని ఫ్రీబీలు ఇస్తే 3 శాతానికి మించి ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ సమస్యను రాజకీయంగా కాకుండా.. వ్యవస్థ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందనీ, రాష్ట్రాల కేటాయింపులు 3 శాతానికి మించితే.. అది ఆర్థిక లోటుకు దారి తీస్తుందనీ, ఆ లోటు వల్ల వచ్చే ఏడాది కేటాయింపును ఫైనాన్స్ కమిషన్ తగ్గించవచ్చని ఆయన అన్నారు. బెంచ్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ఓ ప్యానెల్ ను తయారు చేయాలని అన్నారు. ఉచితాలపై కేంద్ర చట్టం ఉంటే న్యాయ పరిశీలన అనుమతించబడుతుందని , ఏ చట్టమైనా చెల్లుబాటవుతుందని పరీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉందని కపిల్ సిబల్ అన్నారు.
ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో ఎవరికీ సమస్య లేదని, టెలివిజన్ సెట్లు వంటి అనవసరమైన వాటిని ఒక పార్టీ పంపిణీ చేయడంతో ఇబ్బంది తలెత్తిందని అన్నారు. కొన్ని పార్టీలు ఉచిత విద్యుత్తు వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని ప్రభుత్వ రంగ యూనిట్లు (పిఎస్యు) ఆర్థికంగా నష్టపోతున్నాయని అన్నారు. ఓటరుకు అవగాహనతో ఎంపిక చేసుకునే హక్కు ఉందనీ, ఆర్థిక వ్యవస్థ అనుమతించని, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నట్లయితే.. ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందనీ, తీవ్రమైన సమస్యగా పరిగణించాలని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ విషయంలో కోర్టు జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యమని, అయితే సుప్రీం కోర్టు ఏర్పాటు చేయాలనుకున్నా. ఒక కమిటీ, అందులో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉండాలని అన్నారు.