Asianet News TeluguAsianet News Telugu

పౌరసత్వ చట్టం... ముస్లింలకు ఏమీకాదు.. షాహీ ఇమామ్

మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అయితే... అది శాంతియుతంగా జరగాలన్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంటుందన్నారు.

Citizenship Law Has "Nothing To Do With India's Muslims": Shahi Imam
Author
Hyderabad, First Published Dec 18, 2019, 2:46 PM IST

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. కాగా... దేశంలోని ముస్లింలకు మాత్రం ఏమీ కాదంటూ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు.

తాజాగా... ఈ చట్టంపై ఆయన స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం భారత్‌లో నివసిస్తున్న ముస్లింలకు ఎటువంటి నష్టం చేయదని పేర్కొన్నారు. అది కేవలం ముస్లిం శరణార్థులకు ఇచ్చే పౌరసత్వానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) గురించి సయ్యద్‌ మంగళవారం మీడియాతో మట్లాడారు.

నిరసన తెలపడమేని భారత ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్యపు హక్కు అని ఆయన అన్నారు. మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అయితే... అది శాంతియుతంగా జరగాలన్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంటుందన్నారు.

ఎన్సార్సీకి ఇంకా చట్టరూపం దాల్చలేదన్నారు. ఇక పౌరసత్వ సవరణం అనేది కేవలం పాక్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. భారతీయ ముస్లింలకు దాంతో ఎటువంటి నష్టం జరగదని అన్నారు.

అదే విధంగా జామియా యూనివర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని సయ్యద్‌ విఙ్ఞప్తి చేశారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios