Chintan Shivir: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే చింతన్ శివిర్ కు అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వర్చువల్ గా ఈ సమావేశం సందర్బంగా ప్రసంగించనున్నారు.
Union Home Minister Amit Shah: హర్యానాలోని సూరజ్కుండ్లో అన్ని రాష్ట్రాల హోం మంత్రుల 'చింతన్ శివిర్ కొనసాగుతోంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన వహించారు. ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల హోం మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హర్యానాలోని ఫరీదాబాద్లో అంతర్గత భద్రతపై రెండు రోజుల 'చింతన్ శివిర్' (మేధోమథన సెషన్) కోసం సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహాలు హాజరైనట్టు సమాచారం. అలాగే, పలు రాష్ట్రాలు తమ హోం మంత్రులను, ఉపముఖ్యమంత్రులను లేదా సీనియర్ పోలీసు అధికారులను పంపాయి. జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరి, హర్యానా, సిక్కిం రాష్ట్రాల హోంమంత్రులు హాజరైనట్లు కూడా ధృసంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, నాగాలాండ్లకు వాటి ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లడఖ్, జమ్మూకాశ్మీర్ లలో లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి బీహార్ రాష్ట్ర పోలీసు డీజీపీని పంపగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఏడీజీ, పలువురు అధికారులను పంపింది. "రెండు రోజుల 'చింతన్ శివిర్'లో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. రాష్ట్ర హోం సెక్రటరీలు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ డైరెక్టర్ జనరల్స్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొంటారు” అని హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రకటించిన 'విజన్ 2047, పంచ్ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే ఈ సెషన్ లక్ష్యం అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సైబర్-క్రైమ్ మేనేజ్మెంట్ కోసం వ్యవస్థలను అభివృద్ధి చేయడం, పోలీసు బలగాలను ఆధునీకరించడం, నేర న్యాయ వ్యవస్థలో సమాచార సాంకేతికతను పెంచడం, భూ-సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంతాల భద్రత సహా ఇతర అంతర్గత భద్రతా సమస్యలకు సంబంధించిన అంశాలు ఎజెండాలో భాగంగా ఉన్నాయి. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యాన్ని సాధించడంలో 'నారీ శక్తి' పాత్ర ముఖ్యమైనది. మహిళల భద్రత- వారికి సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న రంగాలలో జాతీయ విధాన రూపకల్పన, మెరుగైన ప్రణాళిక, సమన్వయాన్ని సులభతరం చేయడం కూడా సదస్సు లక్ష్యం” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
