UP Elections 2022: యూపీలో 1971 చరిత్ర పునరావృతం.. యోగి ఓటమి ఖాయం.. భీమ్ ఆర్మీ చీఫ్ !
UP Elections 2022: ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ పోటీ చేస్తున్నారు. అయితే, గోరఖ్పూర్ లో 1971 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ ఓడిపోవడం ఖాయమని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ అజాద్ అంటున్నారు.
UP Assembly Election 2022: వచ్చే నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో యూపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, మళ్లీ అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి.. కీలక నేతలు కమలాన్ని వీడుతుండటం కలవరానికి గురిచేస్తున్నది. ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ పోటీ చేస్తున్నారు. అయితే, గోరఖ్పూర్ లో 1971 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనీ, యోగి ఓడిపోవడం ఖాయమని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ అజాద్ అంటున్నారు.
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ అజాద్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆజాద్.. యోగి ఆదిత్యా నాథ్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. గోరఖ్పూర్ ప్రజలు 1971 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్రను పునరావృతం చేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో యోగి ఓటమి ఖాయమనీ, తాను విజయం సాధించబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆజాద్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేస్తోంది. మొత్తం 36 చిన్న చిన్న సంస్థలు, చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడిన సామాజిక పరివర్తన్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్న ఆజాద్.. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.
"మనం గోరఖ్పూర్ చరిత్రలోకి మళ్లీ ఒకసారి తిరిగి వెళ్లాలి.. 1971లో, సిట్టింగ్ ముఖ్యమంత్రి TN సింగ్ను గోరఖ్పూర్ ప్రజలు ఓడించారు. అదేవిధంగా, ఆదిత్యనాథ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. UP, గోరఖ్పూర్ ప్రజలు వారికి బుద్ది చెబుతారు" అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో ఆయన చిన్ని పార్టీలు, వివిధ సంస్థలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. "నేను బీజేపీని ఆపడానికి (SPతో) పొత్తు పెట్టుకోవాలనుకున్నాను. తద్వారా ప్రతిపక్షాల మధ్య విభజన జరగదు. వారు మాకు మా వాటా ఇవ్వకూడదనుకున్నప్పుడు, మేము నిరాకరించాము" అని ఆజాద్ చెప్పారు.
తనపై ఓట్ కట్టర్ అంటూ వస్తున్న విమర్శలను ఆయన ఖండిస్తూ.. "ఉపాధి కోసం యువతపై లాఠీల వర్షం కురిపించినప్పుడు, సోదరీమణులకు అన్యాయం జరిగినప్పుడు.. ప్రజల నిజమైన సమస్యలను లేవనెత్తిన వారికి ఎవరు అండగా నిలిచారు ? " అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో ప్రజలు 2012 నుండి 2017 వరకు SP పాలనను, 2017 నుండి 2022 వరకు బీజేపీ పాలనను చూశారు. “SP ప్రభుత్వంపై నిరాశ చెందిన తర్వాత, ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కాబట్టి, వారి (ఎస్పి) వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు మళ్లీ అదే తప్పు చేయరు” అని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు.
అలాగే, "నేను అతనిని (ఆదిత్యనాథ్) ఓడిస్తాను, దానికి మాకు సంస్థాగత బలం కావాలి. అది మాకు ఉంది. వారి వైఫల్యాలు పుష్కలంగా ఉన్నాయి... ద్రవ్యోల్బణం, కోవిడ్ నిర్వహణ, నిరుద్యోగ నియామకాల స్కామ్లు, శాంతిభద్రతలు, మహిళల భద్రత, ఈ ప్రభుత్వం అన్ని అంశాలలో విఫలమైంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం" అని ఆజాద్ అన్నారు. "ఆదిత్యనాథ్ మంచి పని చేసి ఉంటే, అతను గోరఖ్పూర్కు ఎందుకు తిరిగి వస్తాడు?" గోరఖ్పూర్ ప్రజలు అతనికి భయపడరు. అతని 'తుగ్లక్ ఫార్మాన్లకు' కట్టుబడి ఉండరు. గోరఖ్పూర్ ప్రజలు 1971 నాటి సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించిన చరిత్రను పునరావృతం చేస్తారు" అని ఆయన అన్నారు.
కాగా, కాంగ్రెస్ నాయకుడు త్రిభువన్ నారాయణ్ సింగ్ వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకుండానే 1970 అక్టోబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, 1971లో గోరఖ్పూర్లోని మణిరామ్ స్థానం నుండి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో ఆయన సీఎం పదవికీ రాజీనామా చేశారు.
- Azad Samaj Party
- BJP
- Chandra Shekhar Aazad
- UP Assembly Election 2022
- UP Election News 2022
- UP Elections 2022
- Uttar Pradesh
- Uttar Pradesh elections
- Yogi Adityanath
- assembly election
- assembly election 2022
- అఖిలేష్ యాదవ్
- అసెంబ్లీ ఎన్నికలు
- ఉత్తరప్రదేశ్
- చంద్రశేఖర్ ఆజాద్
- బీజేపీ
- భీం ఆర్మీ చీఫ్
- మోడీ
- యోగి ఆదిత్యానాథ్
- సమాజ్వాదీ