యూకేను చూసి నేర్చుకోవాలి.. మైనార్టీలను ప్రస్తావిస్తూ చిదంబరం, శశిథరూర్ కామెంట్లు.. కాంగ్రెస్ వివరణ
యూకే పీఎంగా రిషి సునాక్ ఎన్నికయ్యాక కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, శశిథరూర్ల ట్వీట్లు సంచలనంగా మారాయి. వారి వ్యాఖ్యలతో పార్టీ కూడా దూరం వహించింది.
న్యూఢిల్లీ: యూకే కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. హిందూ కుటుంబానికి చెందిన రిషి సునాక్ యూకే ప్రధానమంత్రి కావడంపై మన దేశం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు పి చిదంబరం, శశిథరూర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మైనార్టీల విషయాన్ని ప్రస్తావించారు. యూకే నుంచి పాఠాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. వీరి కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఈ కామెంట్లతో కాంగ్రెస్కు సంబంధం లేదన్నట్టు పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ సమాధానం ఇచ్చారు.
పి చిదంబరం ఇలా ట్వీట్ చేశారు.. ‘ముందు కమలా హ్యారిస్, ఇప్పుడు రిషి సునాక్. యూఎస్, యూకే ప్రజలు వారి దేశంలోని మైనార్టీ పౌరులనూ గౌరవిస్తున్నారు. వారిని ఉన్నత పదవుల్లోకీ ఎన్నికుంటున్నారు. ఇక్కడే వారి నుంచి భారత్ ఓ పాఠం నేర్చుకోవాల్సి ఉన్నదని అనిపిస్తున్నది. ముఖ్యంగా మెజారిటేరియనిజాన్ని అనుసరించే అధికారిక పార్టీకి ఇది ముఖ్యమైన పాఠం’ అని మైక్రోబ్లాగింగ్ సైట్లో పేర్కొన్నారు.
కాగా, శశిథరూర్ కూడా దాదాపు ఇంచుమించు ఇలాగే ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే పనిని బ్రిటన్లు చేశారని మనమంతా గుర్తించాల్సి ఉన్నదని నాకు అనిపిస్తున్నది. సులువుగా కనిపించే మైనార్టీ సభ్యుడికే అత్యంత శక్తివంతమైన స్థానాన్ని ఇచ్చారు. భారతీయులుగా మనం రిషి సునాక్ ఎదుగుదలను వేడుక చేసుకుంటాం. కానీ, నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుందాం. అదే ఇక్కడైతే జరిగేదేనా? ’ అని ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే, స్వయంగా కాంగ్రెస్ పార్టీనే ఈ వ్యాఖ్యలతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. భారత్ ఎప్పుడూ బహులత్వాన్ని గౌరవించిందని జైరాం రమేశ్ అన్నారు. ఇందుకు ఆయన పలు ఉదాహరణలు ఇచ్చారు. మన దేశ రాష్ట్రపతులుగానే ముస్లిం నేతలు ఉన్నారు. జకర్ ఉస్సేన్ , ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఏపీజే అబ్దుల్ కలాంలు మైనార్టీ కమ్యూనిటీకి చెందినవారే అయినా.. దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967లో తొలిసారి ప్రధానిగా అయ్యారు. అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, డాక్టర్ అబ్దుల్ కలాంలు ప్రెసిడెంట్ అయ్యారు.