కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ సురక్షితం: మీడియాకు ఫోటో విడుదల చేసిన మావోలు
తమ బందీగా ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఫోటోను మావోయిస్టులు బుధవారం నాడు మీడియాకు విడుదల చేశారు.
రాయ్పూర్: తమ బందీగా ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఫోటోను మావోయిస్టులు బుధవారం నాడు మీడియాకు విడుదల చేశారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాకేశ్వర్ సింగ్ కూర్చొన్న ఫోటోను మావోలు విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ ను విడిచిపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తమతో చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్ ను విడుదల చేస్తామని మావోలు ప్రకటించారు.,
మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే ఆయనను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత రాకేశ్వర్ సింగ్ మావోయిస్టులకు చిక్కాడు. అతడు తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోలు స్థానిక మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. ఇదే విషయమై మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.
ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మరణించారు. సుమారు 30 మందికి పైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మాటు వేసి కాల్పులకు దిగారు.