సారాంశం
మొబైల్ కోసం దాదాపు 41 లక్షల లీటర్ల నీటిని తోడేసిన ఛత్తీస్గఢ్ అధికారికి భారీ షాక్ తగిలింది. ఈ విషయం జలవనరుల శాఖ దృష్టికి వెళ్లడంతో సదరు అధికారికి రూ.53,092 జరిమానా విధించింది.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఖేర్కట్టా రిజర్వాయర్ లో ఓ అధికారి తన ఖరీదైన మొబైల్ ను పడేసుకున్నాడు. దీంతో అధికారి దాదాపు 41 లక్షల లీటర్ల నీటిని బయటకు పంపిచేసి వృథా చేశాడు. ఈ విషయం జలవనరుల శాఖ దృష్టికి వెళ్లడంతో సదరు అధికారికి రూ.53,092 జరిమానా విధించింది. వివరాలలోకి వెళితే కంకేర్ జిల్లాలోని ఖేర్కట్టా రిజర్వాయర్ కు తన మిత్రులతో కలిసి ఫుడ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్ పిక్నిక్ కు వెళ్లారు.
అయితే.. సెల్ఫీ దిగుతున్న సమయంలో తన ఖరీదైన ఫోన్ ఆ డ్యామ్లో పడింది. ఫోన్ కోసం తొలుత ఈతగాళ్లతో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో 15 అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30 హెచ్పీ డీజిల్ పంపులతో ఒకే రోజు 21 లక్షల లీటర్ల నీటిని తోడించేశారు. మూడు రోజుల పాటు నీటిని తోడించేశారు. ఇలా దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లు వృథాగా చేశాడు. ఆ నీరు ఉండుంటే.. దాదాపు 1,500 ఎకరాలకు ఉపయోగపడేవి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలిగించారు.
జలవనరుల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్కు లేఖ
జలవనరుల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్కు లేఖ రాసింది. సంబంధిత అధికారి అనుమతి లేకుండా.. డీజిల్ పంప్ ద్వారా పెద్ద మొత్తంలో నీటిని పంప్ చేయడం చట్టవిరుద్ధం. శిక్ష కిందకు వస్తుందని జలవనరుల శాఖ పేర్కొంది. ఛత్తీస్గఢ్ నీటిపారుదల చట్టం ప్రకారం .. రాజేష్ విశ్వాస్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం 4104 క్యూబిక్ మీటర్ల (41 లక్షల లీటర్లు) నీటిని వృధా చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం క్యూబిక్ మీటరుకు రూ.10.50 చొప్పున రూ.43,092 చెల్లించాలని కోరారు. అనుమతి లేకుండా నీటిని తోడినట్లయితే రూ.10వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. 10 రోజుల్లోగా డిపార్ట్మెంట్కు మొత్తం రూ.53,092 చెల్లించాలని లేఖలో విశ్వాస్ను ఆదేశించింది.
సెల్ఫీ తీసుకుంటుండగా నీటిలో పడిపోయిన మొబైల్
మే 21న విశ్వాస్ తన స్నేహితులతో కలిసి రిజర్వాయర్లో షికారు చేసేందుకు వెళ్లాడని, సెల్ఫీ తీసుకుంటుండగా అతని మొబైల్ ఫోన్ నీటిలో పడిపోయిందని జిల్లా పాలనాధికారి ఒకరు తెలిపారు. మొబైల్ను రికవరీ చేసేందుకు గ్రామస్తుల సహకారంతో మే 25 వరకు డ్యామ్ నుండి నీటిని ఖాళీ చేయడానికి రాజేష్ విశ్వాస్ డీజిల్ పంప్ను అమర్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయం మరుసటి రోజు వెలుగులోకి రావడంతో, కాంకేర్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక శుక్లా దీనికి సంబంధించి నివేదికను కోరింది, ఆ తర్వాత అధికారిని సస్పెండ్ చేశారు.
షోకాజ్ నోటీసు
డ్యామ్ నుండి నీటిని తీసుకోవడానికి మౌఖిక అనుమతి ఇచ్చినందుకు జిల్లా మేజిస్ట్రేట్ జలవనరుల శాఖ సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) RC ధివర్కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ కూడా SDO ధివర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.