Raipur: "బీబీసీ డాక్యుమెంటరీ తప్పు అయితే, దానిని సవాలు చేయాలి.. కానీ మీరు నిషేధిస్తారు లేదా భయపెడుతారు" అంటూ బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ విమర్శలు గుప్పించారు. బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై వ్యాఖ్యానిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
BBC Documentary Row: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీబీసీ డాక్యుమెంటరీ తప్పు అయితే, దానిని సవాలు చేయాలని అన్నారు. అలా కాకుండా వారు నిషేధించడం లేదా భయపెట్టడం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై వ్యాఖ్యానిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్మానాన్ని ఆమోదించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
వివరాల్లోకెళ్తే.. బీబీసీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ డాక్యుమెంటరీ తప్పు అయితే దాన్ని సవాలు చేయాలి కానీ తీర్మానం చేయడం ద్వారా ఏమవుతుందని ప్రశ్నించారు. డాక్యుమెంటరీ తప్పుగా ఉంటే దాన్ని సవాలు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. "కానీ మీరు (బీజేపీ) వారిపై దాడులు నిర్వహించి బెదిరించారు, ఇది సరైంది కాదు" అని ఆయన రాయ్ పూర్ లో మీడియా సమావేశంలో అన్నారు. డాక్యుమెంటరీ తప్పు అయితే చర్యలు తీసుకోవాలని, తీర్మానం చేయడం ద్వారా ఏం జరుగుతుందని ప్రశ్నిస్తూ.. తప్పు కాకపోతే ఆమోదించాలని బఘేల్ పేర్కొన్నారు.
బీబీసీ డాక్యుమెంటరీలో ఏదైనా తప్పు ఉంటే, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు దానిని నిషేధిస్తే.. దానిపై దాడి చేసి, భయపెట్టడానికి ప్రయత్నించారు.. అది సరికాదు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి, తీర్మానం చేస్తే ఏమవుతుంది? : ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్
2002 గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ గుజరాత్ అసెంబ్లీ మార్చి 10న తీర్మానం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు న్యూఢిల్లీ, ముంబయిలోని బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ (బీబీసీ) కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' లింకులను షేర్ చేసే యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టులను బ్లాక్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఆదేశాలు జారీ చేసింది.
కాగా, భూపేష్ బఘేల్ మార్చి 10న ప్రధాని మోడీని కలిసి జనాభా లెక్కలు, రిజర్వేషన్లు, జీఎస్టీ, బొగ్గు, రాయ్ పూర్-దుర్గ్ మధ్య మెట్రో సహా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ప్రధానిని తరచూ కలవడం, ఆయనతో సాన్నిహిత్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధాని మనందరి కోసం ఉన్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయనను కలవడం అవసరమన్నారు. డిమాండ్లను ప్రతిపాదించడం కూడా అత్యవసరమేననీ, అవి నెరవేరనప్పుడు పోరాటం కూడా అవసరమన్నారు. "ఇది వ్యక్తిగత పోరాటం కాదు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన విషయం. సమస్యలపై చర్చించేందుకు ప్రధాని సమయం ఇస్తే బాగుంటుంది" అని పేర్కొన్నారు.
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల విషయంపై సర్వే నిర్వహించడానికి బీజేపీ బృందం ఛత్తీస్ గఢ్ లో పర్యటించడంపై బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ రాయ్ పూర్ నుంచి దుర్గ్ వరకు లైట్ మెట్రో సర్వీసును ప్రారంభించేందుకు ప్రధాని సహకారం కోరినట్లు తెలిపారు. జీ20 నాలుగో స్టాండింగ్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సెప్టెంబర్ నెలలో ఛత్తీస్ గఢ్ లో జరుగనుందని ఆయన తెలిపారు. దీని గురించి కూడా ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. జీ-20 అతిథుల కోసం ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేస్తామని ప్రధానికి హామీ ఇచ్చినట్లు బఘేల్ తెలిపారు.
