15 ఏండ్ల బాలికపై రెండు సార్లు సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్టు
Chhattisgarh: 15 ఏండ్ల బాలికపై రెండు సార్లు సామూహిక అత్యాచారం చేసిన రెండు కేసుల్లో 22 ఏళ్ల యువతితో సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా పేర్కొనగా, వారిలో నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Gang-Raped: 15 ఏళ్ల బాలికపై రెండుసార్లు సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఛత్తీస్గఢ్ లో వెలుగుచూసింది. ఈ రెండు కేసుల్లో 22 ఏళ్ల యువతితో సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా పేర్కొనగా, వారిలో నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక యువతి సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను 23 ఏళ్ల ప్రీతి పాండే, 22 ఏళ్ల అనురాగ్ శుక్లా, 23 ఏళ్ల షానవాజ్, 20 ఏళ్ల ఇమ్రాన్ అలియాస్ బిట్టుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు గురువారం నాడు బాధితురాలు తనపై జరిగిన దారుణాలను ఫిర్యాదు చేయడానికి పోలీస్స్టేషన్కు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసులకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. నాలుగు నెలల క్రితం ప్రీతి పాండే తనను తనతో పాటు బిలాస్పూర్కు తీసుకెళ్లిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ప్రీతి ఓ హోటల్లో బాలికను అనురాగ్ శుక్లా, షానవాజ్, మరో యువకుడికి అప్పగించింది. అక్కడ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే రాజా అలియాస్ ఇమ్రాన్, మరో యువకుడు మళ్లీ సదరు బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. రెండో సారి చిర్మిరిలోని రోడ్డు పక్కన ఉన్న తినుబండారం వద్ద మరో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు తెలిపింది.
గురువారం మనేంద్రగఢ్-చిర్మిరి-భారత్పూర్ (ఎంసీబీ) జిల్లాలోని చిర్మిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. నిందితులైన ప్రీతి, అనురాగ్, షానవాజ్, ఇమ్రాన్లను అరెస్టు చేశారు. అదే సమయంలో ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. చిర్మిరి పోలీసులు నిందితులపై 363 (కిడ్నాప్కు శిక్ష), 366A (మైనర్ బాలికను తీసుకెళ్లడం), లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలావుండగా, కొన్ని స్థానిక మీడియా నివేదికల ప్రకారం బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుల్లో కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. నిందితుడైన షానవాజ్ యూత్ కాంగ్రెస్ నాయకుడని పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, ఆఫీస్ బేరర్ అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. షానవాజ్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ లేదా నాయకుడు కాదని రాయ్పూర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆకాష్ శర్మ అన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇంకా విచారణ పూర్తి కాలేదనీ, పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.